Share News

Bhadradri: నేడు భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం

ABN , Publish Date - Apr 18 , 2024 | 07:04 AM

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రిలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. గురువారం శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ దంపతులు హాజరుకానున్నారు.

Bhadradri: నేడు భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి (Bhadradri)లో శ్రీరామనవమి (Sriramanavami) శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. గురువారం శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం (Sri Rama Maha Pattabhishekha Mahotsavam) జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ (Governor) రాధాకృష్ణన్ (Radhakrishnan) దంపతులు హాజరుకానున్నారు. మిథిలా కళ్యాణ మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.


కాగా బుధవారం శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. కల్యాణ వేదికపై వధూవరులుగా జానకిరాములు ఆసీనులయ్యారు. వరుడి తండ్రి దశరథ మహారాజు తరఫున ఒకటి, వధువు తండ్రి జనక మహారాజు తరఫున ఇంకోటి.. భక్తుల తరఫున మరొకటి.. ఇలా రామదాసు చేయించిన ‘‘మూడు సూత్రాల మంగళసూత్రం’’ వేదమంత్రోచ్ఛారణల నడుమ సీతమ్మవారి మెడలో పడింది. అణిముత్యములు తలంబ్రాలయ్యాయి. ఆ తలంబ్రాలు నీలమేఘశ్యాముడైన రాముడు తన దోసిట తీసుకోగానే నీలపురాశిగా మిలమిలలాడాయి! సీతమ్మ దోసిట్లోకి చేరగానే కెంపులై మెరిశాయి! జానకిరాముల శిరమున వెలసిన ఆ తలబంబ్రాలదెంత భాగ్యం.. ఆ జగత్కల్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తకోటిదెంత పుణ్యం! ఆ భక్తి భావన మనసునిండా ఉప్పొంగగా భక్తజనమంతా అంతా జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. ఇలా బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం క్షేత్రంలో సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సర్కారు తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన తొలి సీఎస్‌ శాంతికుమారే కావడం గమనార్హం. గురువారం రాముచంద్రమూర్తికి మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. మిథిలా స్టేడియంలోనే జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్‌ రాధాకృష్ణన్‌ పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.


తెల్లవారుజామున 2గంటల నుంచే..

బుధవారం తెల్లవారుజామున రెండు గంటలకే అర్చకులు ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళశాసనం, అభిషేకం చేశారు. తదుపరి ధ్రువమూర్తులకు కల్యాణం నిర్వహించారు. ఉదయం 9:30కి కల్యాణమూర్తులను పల్లకిలో ఉంచి మంగళవాయిద్యాలు, కోలాటాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఊరేగింపుగా 10 గంటలకు మిథా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. అక్కడ భక్తుల జయ జయ ధ్వానాల నడుమ స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. తిరువారాధన, విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించి మండపశుద్ధి చేశారు. ప్రత్యేక మంత్రాన్ని జపిస్తూ వేద పండితులు సంకల్పంతో స్వామివారికి ఎదురుగా సీతమ్మను కూర్చోబెట్టి కన్యావరణలు జరిపారు. రక్షాబంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ చేశారు. యోక్త బంధనం, వధూవరుల వంశ గోత్రాలకు సంబంధించి ప్రవరలు ప్రవచించారు. ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పుష్పోదక స్నానం జరిపి వరపూజ నిర్వహించారు. కళ్యాణం సందర్భంగా స్రంపదాయబద్ధంగా భక్తరామదాసు చేయించిన నగలను వధూవరులకు ధరింపజేశారు. భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, రామమాడ తదితర ఆభరణాలను రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణస్వామికి ధరింపజేశారు. సీతారాములకు శృంగేరిమఠం, తిరుమల తిరుపతి దేవస్థానం, పట్టువస్త్రాలు అందజేశారు. భక్తరామదాసు వారసులు కంచర్ల శ్రీనివాసరావు, తూము నరసింహదాసు వంశీకులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అర్చకస్వాములు స్వామివారికి నూతన వస్త్రాలంకరణ చేశారు. రామభద్రుడికి సీతామాతకు వేర్వేరుగా మంగళాష్టకం చదివారు. సరిగ్గా 12 గంటలకు అభిజిత్‌ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమా న్ని ఉత్సవమూర్తుల శిరస్సులపై ఉంచారు. అనంతరం భక్తరామదాసు చేయించిన 3 మంగళసూత్రాలతో సూత్రధారణ కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి, సుప్రింకోర్టు న్యాయమూర్తి పమిడిఘంటం శ్రీ నరసింహ, హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేశ్‌, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు రవినాద్‌ తిలహరి, ఎన్‌.హరినాథ్‌, కె.శ్రీనివాసరెడ్డి, ఎం.కిరణ్మయి, సుమతి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు, ఐజీ ఏవీ రంగనాథ్‌ తదితరులు హాజరయ్యారు. ఏర్పాట్లను భద్రాద్రి కలెక్టర్‌ ప్రియాంక, ఎస్పీ రోహిత్‌రాజ్‌ పర్యవేక్షించారు. యాదాద్రి, వేములవాడ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు పుణ్యక్షేత్రాల్లో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.


భద్రాది సీతమ్మకు సిరిసిల్ల పట్టు చీర

అది పట్టుచీర! బరువు 800 గ్రాములు. ప్రత్యేకత ఏమిటంటే.. నేతలో 2 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండిని ఉపయోగించారు. ఈ చీరను భద్రాద్రి సీతమ్మ వారి కోసం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన యెల్ది హరిప్రసాద్‌ అనే చేనేత కళాకారుడు నేశాడు. 5.5 మీటర్ల పొడవు.. 48 ఇంచుల వెడల్పుతో కూడిన ఈ చీరను నేసేందుకు ఆయన 18రోజుల పాటు శ్రమించాడు. చీరపై సీతారాముల ప్రతిరూపాలు, శంఖు, చక్ర నామాలు, అంచు మీద ‘జై శ్రీరామ్‌’ అనే అక్షరాలు ఉండటం మరో ప్రత్యేకత! హరిప్రసాద్‌ నేసిన ఈ పట్టుచీరను గర్భాలయంలో బుధవారం అమ్మవారి మూల విరాట్టుకు అలంకరించారు. హరిప్రసాద్‌ను సీఎస్‌ శాంతికుమారి అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అందరికీ జీవన్మరణమే!

ధనుంజయ్‌.. ఫటాఫట్‌ సెటిల్‌మెంట్‌!

Updated Date - Apr 18 , 2024 | 07:13 AM