Share News

TS Assembly: ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

ABN , Publish Date - Feb 15 , 2024 | 07:46 AM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఏడవరోజు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇవాళ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. దీనిపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.

TS Assembly: ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఏడవరోజు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇవాళ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. దీనిపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్యవినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. కాగా ప్రభుత్వం ఇవాళ సభలో కుల గణన బిల్లు పెట్టనుంది. అలాగే ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను సర్కార్ సభలో పెట్టనుంది. ఇరిగేషన్, రెవిన్యూ, ఫైనాన్స్, పంచాయితీ రాజ్ నివేదికలను ప్రభుత్వం టేబుల్ చేయనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం అసెంబ్లీలో పలు కీలక ప్రకటనలు చేయనుంది.

లోపాలకు ఎంతమాత్రం తావివ్వకుండా పకడ్బందీగా నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యంలో సంబంధిత శ్వేతపత్రం ముసాయిదా ప్రతుల్లో ప్రతిరోజూ మార్పులు చేస్తోంది. బుధవారం కూడా నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా శ్వేతపత్రంలో పలు మార్పులు, చేర్పులు చేయించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అక్రమాలన్నీ వెలుగుచూసేలా శ్వేతపత్రం ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 2014 నుంచి 2023దాకా చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ ప్రధానంగా శ్వేతపత్రంలో పేర్కొననున్నారు. ప్రాజెక్టుల వారీగా వ్యయం, కొత్త ఆయకట్టు వంటి అంశాలే ప్రముఖంగా శ్వేతపత్రంలో ఉండనున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మధ్యంతర నివేదిక, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో చోటుచేసుకున్న వైఫల్యాలు ఇందులో పొందుపరచనున్నారు.

దేశవ్యాప్తంగా బ్యారేజీల సామర్థ్యం, ఆయా బ్యారేజీల కింద సాగు విస్తీర్ణంపాటు మేడిగడ్డ వైఫల్యానికి కారణమైన నీటి నిల్వ సామర్థ్యం ప్రధానంగా ప్రస్తావించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక సారాంశం కూడా శ్వేతపత్రంలో ఉండనుంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఉంటే కలిగే ప్రయోజనాలు, రీఇంజనీరింగ్‌తో తెరమీదికి తెచ్చి చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం శ్వేతపత్రంలో ఉండనుంది. గత పదేళ్లలో ప్రాజెక్టుల నిర్మాణం ఏ ప్రయోజనాల కోసం చేపట్టారో ప్రభుత్వం స్పష్టం చేయనుంది. కాగా శ్వేతపత్రం ఏ రోజు విడుదల చేయాలనే దానిపై స్పష్టత రాలేదు. బుధవారం శాసనసభలో శ్వేతపత్రం పెట్టనున్నట్లు మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. అయితే ఈ రోజు బడ్జెట్‌పై చర్చకే సభ పరిమితమైంది. ఏ రోజు శ్వేతపత్రం పెట్టాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మరికొన్ని రోజులు సభ సాగే అవకాశం ఉండటంతో బడ్జెట్‌పై చర్చ అనంతరమే శ్వేతపత్రం సభలో పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Updated Date - Feb 15 , 2024 | 07:46 AM