Share News

Hyderabad: రూ.40 వేలేనా.. ఇంకేం లేదా?!

ABN , Publish Date - Apr 21 , 2024 | 10:29 AM

ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో జేఎన్‌టీయూ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ(ఎఫ్‌ఎఫ్‏సీ) తనిఖీలకు వెళ్లిన అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Hyderabad: రూ.40 వేలేనా.. ఇంకేం లేదా?!

- ఎఫ్‌ఎఫ్‏సీ తనిఖీల్లో జేఎన్‌టీయూ అధికారుల చేతివాటం

- కాలేజీల యాజమాన్య ప్రతినిధుల ఆక్షేపం

హైదరాబాద్‌ సిటీ: ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో జేఎన్‌టీయూ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ(ఎఫ్‌ఎఫ్‏సీ) తనిఖీలకు వెళ్లిన అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం(Khammam) జిల్లాలోని కొన్ని కళాశాలల్లో శుక్రవారం తనిఖీల నిమిత్తం వెళ్లిన జేఎన్‌టీయూ(JNTU) అధికారులకు ఆయా కాలేజీల యాజమాన్యాలు రూ.40 వేల చొప్పున మామూళ్లు ఇచ్చినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అయితే.. ఒక కళాశాలలో యాజమాన్యం ఇచ్చిన రూ.40వేలతో సంతృప్తి చెందని ఓ అధికారి ఇంతేనా.. ఇంకేం లేదా.. అని అడగడం అక్కడి సిబ్బందిని విస్మయానికి గురిచేసింది. యూనివర్సిటీ ఉన్నతాధికారులకైతే ఎక్కువ మొత్తం ఇస్తారా.. మాకు మాత్రం తక్కువ ఇస్తారా? అని కాసేపు వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. నెలకు రూ.3-4 లక్షల వేతనం తీసుకుంటున్న ప్రొఫెసర్లు సైతం డబ్బు కోసం కక్కుర్తి పడుతుండడాన్ని కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. తనిఖీలకు వచ్చిన అధికారులే ఇంతగా డిమాండ్‌ చేస్తుంటే.. అఫిలియేషన్‌ ఇచ్చే ఉన్నతాధికారులు ఇంకెంత అడుగుతారో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఓవైపు జేఎన్‌టీయూ తనిఖీలపై ఎన్నికల సంఘం దృష్టి సారించినప్పటికీ, తనిఖీలకు వెళ్లిన అధికారులు యథేచ్ఛగా డబ్బులు డిమాండ్‌ చేస్తుండడం దారుణమని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. మొత్తంగా అధికారులు మలివిడతలో తొలిరోజు 10 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలను పూర్తి చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రిమాండ్‌ ఖైదీ కడుపులో ఇనుప మేకులు...

ప్రొఫెసర్లు విముఖత

మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎండవేడిమి అధికంగా ఉండడం, ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 45 డిగ్రీలకు చేరుతుండడంతో తనిఖీలకు వెళ్లేందుకు కొందరు ప్రొఫెసర్లు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తనిఖీలకు వెళ్లిన వారిలో కొందరు.. తమకు వడదెబ్బ తగలిందని, మరికొందరు జ్వరం వచ్చినందున తర్వాత రోజు తనిఖీలకు రాలేమని ఉన్నతాధికారులకు కబురు పంపినట్లు సమాచారం. ఓవైపు నెలాఖరు కల్లా ఎఫ్‌ఎ్‌ఫసీ తనిఖీలను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు భావిస్తుంటే.. మరోవైపు ప్రొఫెసర్లు విముఖత వ్యక్తం చేయడం గమనార్హం.

ఇదికూడా చదవండి: CP Srinivasa Reddy: పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలి

తనిఖీల ఫార్మాట్‌లో ఏఐసీటీఈ ప్రమాణాలేవీ?

ఏఐసీటీఈ నిర్దేశించిన ప్రమాణాల మేరకే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ(ఎఫ్‌ఎ్‌ఫసీ) తనిఖీలు నిర్వహిస్తుందని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ కె.వెంకటేశ్వరరావు ఇటీవల స్పష్టం చేశారు. అయితే.. తొలిరోజు తనిఖీలకు వెళ్లిన అధికారులకు ఇచ్చిన ఫార్మాట్‌లో ఏఐసీటీఈ నిర్దేశించిన కొన్ని అంశాలను ప్రస్తావించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా 50 మంది ఉద్యోగులు పనిచేసే అన్ని విద్యాసంస్థల్లో ఉద్యోగుల పిల్లల సంరక్షణ కోసం క్రెచ్‌లు ఏర్పాటు చేయాలన్న నిబంధనను తనిఖీల ఫార్మాట్‌లో పొందుపర్చారు. అయితే, ఆ అంశాన్ని ప్రస్తావించని అధికారులు నిబంధనలను తుంగలో తొక్కారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదికూడా చదవండి: ప్రజలపై పన్నుల భారం మోపం

Updated Date - Apr 21 , 2024 | 10:29 AM