Hyderabad: పారిశ్రామిక ప్రగతి కొత్తపుంతలు తొక్కేలా..
ABN , Publish Date - May 24 , 2024 | 03:45 AM
సకాలంలో ప్రొత్సాహకాలను అందించి పారిశ్రామిక ప్రగతిని కొత్తపుంతలు తొక్కించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, ఇప్పటికే పరిశ్రమలను నిర్వహిస్తున్న వారికి సకాలంలో ప్రొత్సాహకాలు అందించేలా విధానాల రూపకల్పనకు ప్రభుత్వం సిద్ధమైంది.
6 విధానాలపై కసరత్తు బీఆర్ఎస్ హయాంలో
బకాయిలు 3736 కోట్లు కొన్ని పరిశ్రమలకు ఇచ్చిన
684 కోట్ల చెక్కులు బౌన్స్ ఇకపై జాప్యం లేకుండా
ప్రోత్సాహకాలు మంజూరు సర్కారు సన్నాహాలు
హైదరాబాద్, మే 23(ఆంధ్రజ్యోతి): సకాలంలో ప్రొత్సాహకాలను అందించి పారిశ్రామిక ప్రగతిని కొత్తపుంతలు తొక్కించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, ఇప్పటికే పరిశ్రమలను నిర్వహిస్తున్న వారికి సకాలంలో ప్రొత్సాహకాలు అందించేలా విధానాల రూపకల్పనకు ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వం పరిశ్రమలకు రాయితీలు, ప్రొత్సాహకాల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికి.. విడుదల చేయలేదు. దీంతో నిర్వహణ భారం భరించలేక చాలా పరిశ్రమలను మూసేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇలా సకాలంలో చెల్లించని ప్రొత్సాహకాల బకాయిలు రూ.3736 కోట్ల మేర ఉన్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షల్లో వెల్లడైంది. అందులో రూ.3007 కోట్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించినవి కాగా, రూ.728 కోట్లు భారీ, మెగా పరిశ్రమలకు సంబంధించినవిగా ప్రభుత్వం గుర్తించింది. అలాగే.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని పరిశ్రమలకు ఇచ్చిన రూ.684 కోట్ల చెక్కులు కూడా బౌన్స్ అయినట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలను ప్రొత్సహించేలా, పెట్టుబడులను ఆకర్షించేలా సరికొత్త పాలసీల రూపకల్పనకు సిద్ధమవుతోంది.గతంలో జరిగిన తరహాలో ఎలాంటి తప్పిదాలకూ తావులేకుండా.. పరిశ్రమలను ప్రొత్సహించేలా నూతనంగా ఆరు పారిశ్రామిక విధానాలను అమలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో విధాన పరమైన నిర్ణయాలలో జరిగిన జాప్యం వల్ల.. నిర్ణీత సమయానికి ప్రోత్సాహకాలు అందించకపోవడంవల్ల పారిశ్రామికవేత్తలు నిరుత్సాహపడ్డారు. దీంతో పారిశ్రామిక ప్రగతిలో కొన్ని ఒడుదొడుకులు ఎదురైనట్లు ప్రస్తుత ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది. అలాంటివి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని నూతన పారిశ్రామిక విధానం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. గత ప్రభుత్వం ఇస్తామన్న ప్రోత్సాహకాలు అందక పరిశ్రమలను మూతవేసుకునే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో.. ఆ బకాయిలను చెల్లించి పారిశ్రామిక ప్రగతిని గాడిలో పెట్టాలని సూచించారు.
ఆ ఆరు రంగాల్లో..
పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తెలంగాణ పారిశ్రామిక విధానాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎ్సఐఐసీ) సమావేశంలో ఉన్నతాధికారులకు సూచించారు. ఎంఎ్సఎంఈ, ఎగుమతులు, న్యూ లైఫ్ సైన్సెస్, రివైజ్ ఈవీ, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి నూతనంగా ఆరు పాలసీలు రూపొందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో చేనేత కార్మికులను దృష్టిలో ఉంచుకుని పవర్లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులను ఆదుకునేలా నూతన పాలసీ తయారు చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.