Share News

Virender Sehwag: ‘పిచ్’ కామెంట్లపై సెహ్వాగ్ కౌంటర్.. దెబ్బ అదుర్స్ కదూ!

ABN , Publish Date - Jan 04 , 2024 | 08:34 PM

కేప్‌టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. భారత పేసర్లు విజృంభించడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో 55, రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకే సౌతాఫ్రికా...

Virender Sehwag: ‘పిచ్’ కామెంట్లపై సెహ్వాగ్ కౌంటర్.. దెబ్బ అదుర్స్ కదూ!

Virender Sehwag: కేప్‌టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. భారత పేసర్లు విజృంభించడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో 55, రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకే సౌతాఫ్రికా చాపచుట్టేసింది. దీంతో.. ఈ మ్యాచ్‌ని భారత్ సునాయాసంగా గెలిచింది. అయితే.. ఈ పిచ్ సరిగ్గా లేదని కొందరు విమర్శలు చేశారు. సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ ఆష్లే ప్రిన్స్ సైతం పిచ్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కేప్‌టౌన్ పిచ్ అనూహ్యంగా బౌన్స్ అవుతోందని, గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని, పిచ్‌లోపే లోపం ఉండొచ్చని వ్యాఖ్యానించాడు. ఇందుకు భారత మాజీ క్రికెటర్ విరేందర్ సెహ్వాగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.


‘‘మీరు చేస్తే మ్యాజిక్, మేము చేస్తే పిచ్ లోపమా? (Aap karo toh Chamatkar.. Hum karein toh pitch bekaar..)’’ అని విరేందర్ సెహ్వాగ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన ఈ మ్యాచ్ కేవలం 107 ఓవర్లలోనే ముగిసిందన్న ఆయన.. ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు తమ సత్తా చాటారని అన్నారు. అంతేకాదు.. క్వాలిటీ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకి మరింత ప్రమాదకరంగా తయారయ్యారని బౌలర్లను కొనియాడాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచారని.. జట్టు విజయంలో వీళ్లిద్దరు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఒక గొప్ప విజయంతో ఈ ఏడాది భారత జట్టు ప్రారంభించిందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. అటు.. సురేశ్ రైనా సైతం భారత జట్టు అద్భుత విజయం సాధించిందని పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇదిలావుండగా.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. కేవలం 642 బంతుల్లోనే ఇది ముగియడంతో.. బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన టెస్టు మ్యాచ్‌గా చరిత్రపుటలకెక్కింది. అలాగే.. ఈ విజయంతో భారత జట్టు కేప్‌టౌన్‌లో గెలుపొందిన తొలి ఏసియన్ జట్టుగా రికార్డ్ నెలకొల్పింది. అంతేకాదు.. సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్‌ని భారత్ డ్రాగా ముగించడం ఇది రెండోసారి. అయితే.. సౌతాఫ్రికాలో భారత్ ఇప్పటివరకూ ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. ఆ లోటు ఎప్పుడు తీరుతుందో తెలీదు. ఏదేమైనా.. ఈ రెండో మ్యాచ్ గెలుపొంది, భారత్ ఈ టెస్టు సిరీస్‌ని 1-1తో సమం చేసింది.

Updated Date - Jan 04 , 2024 | 08:34 PM