Share News

India vs England: రెండో టెస్టుకి ఆ ఇద్దరు దూరం.. వారి స్థానంలో ఈ ముగ్గురికి చోటు!

ABN , Publish Date - Jan 29 , 2024 | 07:34 PM

తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం చవిచూసిన భారత జట్టుకి తాజాగా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. వైజాగ్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. వాళ్లే.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా & కేఎల్ రాహుల్.

India vs England: రెండో టెస్టుకి ఆ ఇద్దరు దూరం.. వారి స్థానంలో ఈ ముగ్గురికి చోటు!

తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం చవిచూసిన భారత జట్టుకి తాజాగా రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. వైజాగ్‌లో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. వాళ్లే.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా & కేఎల్ రాహుల్. బీసీసీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ నాలుగో రోటు ఆటలో భాగంగా జడేజాకు గాయమైంది. తొడ భాగంలో అతనికి దెబ్బ తగిలినట్టు తేలింది. ఇక కేఎల్ రాహుల్‌కి కూడా అలాంటి సమస్యతోనే బాధపడుతున్నాడని.. తాను కుడి క్వాడ్రైసిప్స్‌ నొప్పితో బాధపడుతున్నానని ఫిర్యాదు చేశాడని తెలిసింది. అందుకే.. రెండో టెస్టు మ్యాచ్‌కి వీళ్లు దూరమయ్యారు. ప్రస్తుతం వీళ్లిద్దరు వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.


‘‘ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి వైజాగ్‌లో ప్రారంభమయ్యే రెండో టెస్టు మ్యాచ్‌కు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. వీళ్లిద్దరు గాయాలతో బాధపడుతుండటం వల్లే వీళ్లకు విశ్రాంతి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం బీసీసీఐ వైద్యబృందం వీరిని పర్యవేక్షిస్తోంది’’ అని బీసీసీఐ ఒక స్టేట్‌మెంట్‌లో తెలిపింది. ఆ ఇద్దరు వైదొలగడంతో.. సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లకు జట్టులో చోటు దక్కింది. తమ సెలక్షన్ కమిటీ ఆ ముగ్గురిని జట్టులోకి చేర్చిందని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. మరి.. తమకు అందివచ్చిన అవకాశాన్ని వీళ్లు ఎలా వినియోగించుకుంటారో? ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సర్ఫరాజ్, సుందర్‌లు ఇండియా A జట్టులో భాగంగా ఉన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో ఇండియా-ఏ జట్టు తరఫున వీళ్లిద్దరు మంచి ప్రదర్శన కనబరిచారు. సర్ఫరాజ్ 161 పరుగులు చేయగా.. సుందర్ రెండు వికెట్లు తీయడంతో పాటు అర్థశతకం చేశాడు.

ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో టెస్టుకి భారత జట్టు (ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్

Updated Date - Jan 29 , 2024 | 07:34 PM