Rammandir: వావ్.. అంతరిక్షం నుంచి అయోధ్య రామ మందిరాన్ని చూస్తే ఇలా ఉంటుందా!
ABN , Publish Date - Jan 21 , 2024 | 06:32 PM
ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)..ఉపగ్రహం సాయంతో అంతరిక్ష నుంచి రామమందిర చిత్రాలను తీసింది.
![Rammandir: వావ్.. అంతరిక్షం నుంచి అయోధ్య రామ మందిరాన్ని చూస్తే ఇలా ఉంటుందా!](https://media.andhrajyothy.com/media/2023/20231205/1_2228484a1f.jpg)
ఇంటర్నెట్ డెస్క్: అయోధ్యలో శ్రీరామమందిర (Ayodhya Ram mandir) ప్రతిష్ఠాపన కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సీతాలక్ష్మణ సమేతంగా కొలువుదీరిన బాల రాముడి దర్శనం కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తోంది. రేపు జరగబోయే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాట్లన్నీ ఓ కొలిక్కి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఇస్రోకు (ISRO) చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)..ఉపగ్రహం సాయంతో తీసిన రామమందిర చిత్రాలను (Satellite Pictures) విడుదల చేసింది. ఎన్ఆర్ఎస్సీ షేర్ చేసిన ఈ చిత్రాలు నెట్టింట వైరల్గా మారాయి.
ఎన్ఆర్ఎస్సీ వివరాల ప్రకారం, ఈ చిత్రాలను గతేడాది డిసెంబర్ 16న తీశారు. ఈ చిత్రాల్లో రామమందిరంతో పాటూ దశరథ్ మహల్, సరయూ నది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే అభివృద్ధి పరిచిన అయోధ్య రైల్వే స్టేషన్ కూడా చిత్రాల్లో చూడొచ్చు.
రామమందిర తొలి దశ నిర్మాణం దాదాపుగా పూర్తయిన విషయం తెలిసిందే. నగారా శైలిలో 380 అడుగుల పొడవు, 250 అడుగు వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఈ మందిరం నిర్మించారు. రామమందిరంలోని ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తు ఉంటుంది. 392 స్తంభాలు, 44 గ్లేట్లు ఉంటాయి. కాగా, ఇక జనవరి 22న జరగబోయే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొంటారు.