Share News

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

ABN , Publish Date - Feb 19 , 2024 | 07:14 PM

అయోధ్య రామ్ లల్లా(Ayodhya Ram Mandir) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంపై కర్ణాటకకు చెందిన ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాద్ సోమవారం బెంగళూరులో మాట్లాడుతూ.. రాజకీయ ఉద్దేశంతోనే బీజేపీ రామ మందిరాన్ని నిర్మించిందని ఆరోపించారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

బెంగళూరు: అయోధ్య రామ్ లల్లా(Ayodhya Ram Mandir) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంపై కర్ణాటకకు చెందిన ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాద్ సోమవారం బెంగళూరులో మాట్లాడుతూ.. రాజకీయ ఉద్దేశంతోనే బీజేపీ రామ మందిరాన్ని నిర్మించిందని ఆరోపించారు. రామ మందిర నిర్మాణం దేశంలోని పేదరికాన్ని నిర్మూలించగలిగిందా అని కామెంట్స్ చేయడం వివాదాన్ని రేపింది.

ఈ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మంత్రి మాట్లాడుతూ.. "రామమందిరాన్ని బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి నిర్మించింది. ఆలయానికి ఎంపిక చేసిన స్థలం సుప్రీంకోర్టు సూచించిన ప్రదేశానికి భిన్నంగా ఉంది. ఆలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించట్లేదు. సుప్రీం కోర్టు సూచించిన స్థలంలో కేవలం 40 శాతం మాత్రమే నిర్మించి.. మిగతాది వేరే ప్రాంతానికి విస్తరించారు. ఓ వైపు ఢిల్లీలో రైతులు డిమాండ్లు నెరవేర్చాలని నిరసనలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. మందిరాన్ని నిర్మించి బీజేపీ ఓట్లు అడగడమేంటి. ఆలయం వల్ల రైతులు, పేద ప్రజలు లబ్ధి పొందారా. రైతులపై బుల్డోజర్లు, టియర్ గ్యాస్‌లు ఎందుకు ప్రయోగిస్తున్నారు" అని మంత్రి కామెంట్స్ చేశారు.


మండిపడ్డ బీజేపీ..

రామమందిరంపై మంత్రి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. మాజీ సీఎం ఆ పార్టీ సీనియర్ నేత బసవరాజు బొమ్మై మాట్లాడుతూ.. 500 ఏళ్ల చరిత్ర కలిగిన రామమందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆయన 500 ఏళ్ల క్రితం పుట్టలేదని.. రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. వాటిపై మంత్రి దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. మంత్రి వ్యాఖ్యలను మాజీ ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. రామ మందిర చరిత్రను మంత్రి తెలుసుకోవాలని సూచించారు.

ఆలయ నిర్మాణంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని.. ఈ అంశాన్ని రాజకీయాల్లోకి లాగకూడదని విన్నవించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ స్పందిస్తూ.. మంత్రి మాట్లాడినదాంట్లో తప్పేముంది అని అన్నారు. బీజేపీ నేతలు మతం తదితర భావోద్వేగ అంశాలను రాజకీయాల కోసం ఉపయోగించుకుంటుందనేది కఠోర సత్యమని విమర్శించారు. ఎలాంటి అభివృద్ధి చేయకుండా మత ప్రాతిపాదికన ఓట్లు అడగడం బీజేపీకే చెల్లిందని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2024 | 07:14 PM