Union Minister: అయోధ్యలో జరిగేది కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీ కాదు..
ABN , Publish Date - Jan 12 , 2024 | 10:07 AM
అయోధ్యలో జరుగుతుండేది 140కోట్ల మంది భారతీయులు కలలుకన్న ఆలయ ఆరంభమని, శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనా సంబరమని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ర్యాలీ కాదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్జోషి(Prahlad Joshi) ఎద్దేవా చేశారు.

- కేంద్రమంత్రి ప్రహ్లాద్జోషి ఎద్దేవా
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో జరుగుతుండేది 140కోట్ల మంది భారతీయులు కలలుకన్న ఆలయ ఆరంభమని, శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనా సంబరమని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ర్యాలీ కాదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్జోషి(Prahlad Joshi) ఎద్దేవా చేశారు. గురువారం మంత్రి ట్విట్టర్ ద్వారా రామమందిర ఆరంభం ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. దేశప్రజలు, రామభక్తులు కాంగ్రెస్ వారిని ఎప్పుడో తిప్పికొట్టారన్నారు. శ్రీరాముడిపై భక్తి, నమ్మకం, విశ్వాసం ఉండేవారు ఏ పార్టీకి చెందిన వారైనా రాజకీయాలను పక్కనబెట్టి దర్శించుకుంటారన్నారు. రాష్ట్రంలో అబద్దాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పాలనా వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు ఇటువంటి అంశాలను తెరపైకి తీసుకువచ్చేలా కుట్రలు సరికావని సీఎం సిద్దరామయ్యను ఉద్దేశించి మండిపడ్డారు. అబద్దాల ప్రభుత్వం ఎటువైపు వెళుతుందనేది ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. రాముడంటే ఈదేశ సంస్కృతి అని కనీసం ఉడుతలాంటి సేవ చేసేందుకు కాంగ్రెస్ వారి నుంచి కాలేదన్నారు. ఇలాంటి సందర్భంలో రామమందిర ప్రారంభానికి ఏ మొహం పెట్టుకుని వస్తారన్నారు. ఆయోధ్య మందిర ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా వారు ఎలాంటి ఆలోచనలు కలిగిన వారో తెలుస్తుందన్నారు. ఆధ్యాత్మికంగా కాకున్నా రాముడు అనేది మన సంస్కృతి అనే దృష్టి నుంచి చూసే ముస్లింలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ ను తిరస్కరించే కాలం వస్తోందని మండిపడ్డారు.