Share News

BJP In Odisha : ఒడిసాలో కమల వికాసం!

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:31 AM

ఒడిసా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. 24 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని ఏలిన నవీన్‌ పట్నాయక్‌కు ప్రజలు షాక్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసి, దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలనుకున్న ఆయనకు నిరాశే మిగిలింది.

BJP In Odisha : ఒడిసాలో కమల వికాసం!

  • తొలిసారి రాష్ట్రంలో గద్దెనెక్కిన బీజేపీ.. 147 స్థానాలకు

    గాను 78 సీట్లలో గెలుపు

భువనేశ్వర్‌, జూన్‌ 4: ఒడిసా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. 24 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని ఏలిన నవీన్‌ పట్నాయక్‌కు ప్రజలు షాక్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసి, దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలనుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. అధికార బిజూ జనతాదళ్‌ (బీజేడీ)ను బీజేపీ గట్టి దెబ్బ కొట్టింది. గనులు, చిట్‌ఫండ్‌ కుంభకోణంపై విచారణ కమిటీ నివేదికను దాచిపెట్టడం సహా పలు కీలక అంశాలను ప్రచారాస్త్రాలుగా వాడుకొని ఒడిసాలో తొలిసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగానూ బీజేపీ 78 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. బీజేడీ 51 స్థానాలతో సరిపెట్టుకోగా.. కాంగ్రెస్‌ 14 స్థానాల్లో గెలుపొందింది. సీపీఎం 1, ఇతరులు 3 సీట్లు దక్కించుకున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా బీజేపీ అగ్రనేతలంతా ఒడిసాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

మిత్రుడైన నవీన్‌ పట్నాయక్‌పై మోదీ ఎన్నికల ప్రచారంలో యుద్ధం ప్రకటించారు. నవీన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని.. ఆయనకు రాష్ట్రాన్ని పాలించే సామర్థ్యం ఉందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో నవీన్‌ పట్నాయక్‌ చెయ్యి వణికిపోతుండగా.. ఆయన సహాయకుడు వీకే పాండియన్‌ మైక్‌ను పట్టుకొని, నవీన్‌ చేతిని పక్కకు తోసేసిన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని కూడా ప్రధాని మోదీ ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. నవీన్‌ ఆరోగ్యం అంత వేగంగా ఎందుకు పాడైందని అనుమానాలు వ్యక్తం చేశారు.


దీంతో ఆయనకు వయసు పైబడుతోందని, ఎక్కువ కాలం సీఎంగా కొనసాగలేరన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి. నవీన్‌ ఎక్కువగా ఆయన సహాయకుడు, తమిళనాడుకు చెందిన వీకే పాండియన్‌పై ఆధారపడుతున్నారన్న ఆరోపణలూ చేశారు. 2000 బ్యాచ్‌ ఒడిసా కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి వీకే పాండియన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒడిసా ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన ునబిన్‌ ఒడిసా, విజన్‌ 5టీ్‌కి కేబినెట్‌ మంత్రి హోదాలో చైర్మన్‌గా నియమించారు. ఆ తర్వాత నెల రోజులకే పాండియన్‌ బీజేడీలో చేరారు. అనంతరం పాలనలో పాండియన్‌ పెత్తనం పెరిగిపోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నవీన్‌ తన వారసుడిగా స్థానికేతరుడైన పాండియన్‌ను ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది. పాండియన్‌ లక్ష్యంగా బీజేపీ కూడా విస్తృత ప్రచారం చేసింది. నవీన్‌కు మళ్లీ అవకాశమిస్తే పాలనా పగ్గాలు స్థానికేతరుడి చేతిలోకి వెళ్లిపోతాయంటూ చేసిన ప్రచారం ఒడిసా ప్రజలను ఆలోచింపజేసింది. కాగా, పాండియన్‌పై బీజేడీ నేతలు, ఒడిసా అధికారుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమైంది.

  • లోక్‌సభ ఎన్నికల్లోనూ..

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ బీజేపీ సత్తా చాటింది. మొత్తం 21

లోక్‌సభ స్థానాలకుగాను 19 సీట్లను గెలుచుకుంది.

Updated Date - Jun 05 , 2024 | 04:34 AM