Supreme Court: అధికారులకు న్యాయస్థానాలు సమన్లు జారీ చేయడంపై కీలక మార్గదర్శకాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Jan 03 , 2024 | 01:42 PM
న్యాయస్థానాలు అధికారులను కోర్టులకు పిలిపించడం, వస్త్రధారణపై వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అధికారులను కించపరిచేలా మాట్లాడడం, వారి వేషధారణపై వ్యాఖ్యలు చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని న్యాయస్థానాలను సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.
![Supreme Court: అధికారులకు న్యాయస్థానాలు సమన్లు జారీ చేయడంపై కీలక మార్గదర్శకాలు జారీ చేసిన సుప్రీంకోర్టు](https://media.andhrajyothy.com/media/2023/20231205/Untitled_6_3de8d613e5.jpg)
న్యూఢిల్లీ: న్యాయస్థానాలు అధికారులను కోర్టులకు పిలిపించడం, వస్త్రధారణపై వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అధికారులను కించపరిచేలా మాట్లాడడం, వారి వేషధారణపై వ్యాఖ్యలు చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని న్యాయస్థానాలను సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వాధికారులను కోర్టుల ముందు హాజరుకావాలంటూ జారీ చేసే సమన్లు విషయంలో ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ పేరిట కొన్ని మార్గదర్శకాలను సూచించింది.
ఏకపక్షంగా కోర్టుకు పిలిపించే విషయంలో అధికారులకు మినహాయింపునివ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను దేశంలోని అన్ని హైకోర్టులు తప్పనిసరిగా అనుసరించాలని ఆదేశించింది. అధికారుల వస్త్రధారణపై వ్యాఖ్యలకు జడ్జిలు దూరంగా ఉండాలని, కోర్టు కార్యాలయంలో దుస్తుల కోడ్ను ఉల్లంఘిస్తే తప్ప అధికారుల వస్త్రధారణను కించపరిచేలా మాట్లాడొద్దని అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది.
గతేడాది ఇద్దరు సీనియర్ ప్రభుత్వ అధికారులు కోర్టుకు హాజరుకావాలంటూ అలహాబాద్ హైకోర్టు సమన్లు జారీ చేయడాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలను సమర్థించింది. అయితే ప్రభుత్వాధికారులను తరచూ కోర్టులకు పిలిపిస్తే రాజ్యాంగం ప్రకారం అమలవుతున్న పథకాల అమలు విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని సుప్రీ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు బుధవారం ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. అఫిడవిట్ల ద్వారా సమస్యలను పరిష్కరిస్తే ప్రభుత్వ అధికారులను కోర్టులకు పిలవాల్సిన అవసరం ఉండదని సూచన చేసింది. అయితే కేసు ప్రక్రియలో భాగంగా సాక్ష్యంగా అధికారుల వ్యక్తిగత హాజరు ఆవశ్యకతను కోర్టు గుర్తుచేసింది. కోర్టు దృష్టికి భిన్నంగా అధికారి ఆలోచించినంత మాత్రన సమన్లు జారీ చేయడం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.