Supreme Court: అదానీ హిడెన్ బర్గ్ కేసులో సుప్రీం సంచలన తీర్పు
ABN , Publish Date - Jan 03 , 2024 | 11:50 AM
అదాని హిడెన్ బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సెబీ దర్యాప్తును సుప్రీంకోర్టు సమర్ధించింది. అదానీ కేసులో సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
ఢిల్లీ: అదాని హిడెన్ బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సెబీ దర్యాప్తును సుప్రీంకోర్టు సమర్ధించింది. అదానీ కేసులో సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. సెబీ పరిధిలోకి ప్రవేశించడానికి సుప్రీంకోర్టు అధికారం పరిమితమైనదని అభిప్రాయపడింది. సెబీ రెగ్యులేషన్స్ లో సవరణలు చేయాలని ఆదేశించడానికి, వాటిని నియంత్రించడానికి కానీ సరైన ఆధారాలు లేవని తెలిపింది. అదానీ కేసులో మొత్తం 24 ఆరోపణల్లో 22 ఆరోపణలపై ఇప్పటికే సెబీ విచారణ పూర్తి చేసిందని వెల్లడించింది.
హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో షార్ట్ సెల్లింగ్ ఉల్లంఘనలను ప్రభుత్వం, సెబీ పరిశీలించాలని సుప్రీం ఆదేశించింది. చట్టాలకు అనుగుణంగా సెబీ విచారణ పూర్తి చేసి సరైన ముగింపునివ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ సభ్యుల నిజాయితీపై లేవనెత్తిన ప్రశ్నలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సెబీ దర్యాప్తును సమర్థించింది. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ చర్యలనూ సమర్ధించింది. నిపుణుల కమిటీ పై వచ్చిన ఆరోపణలనూ తోసిపుచ్చింది. సెబీ రెగ్యులేషన్స్ పరిధిలోకి వెళ్లదలచుకోలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వం, సెబీలు పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలని సీజేఐ ధర్మాసనం సూచించింది. స్టాక్ మార్కెట్ లో షేర్ విలువ పెంచుకునేందుకు అదానీ కంపెనీ అవకతవకలకు పాల్పడిందని 2023 జనవరిలో అమెరికా కు చెందిన హిడెన్ బర్గ్ సంస్థ నివేదిక వెలువరించింది. ఈ నివేదిక దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై దర్యాప్తు కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని పలువురు ఆశ్రయించారు. దీనిపై సెబీ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపి గత సంవత్సరం నవంబర్ 24న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.