Ram Mandir: హరిహరన్ రామభజనపై ప్రధాని మోదీ ప్రశంసలు.. అందరినీ రాముని భక్తిలో..
ABN , Publish Date - Jan 09 , 2024 | 03:07 PM
అయోధ్యలోని రామమందిరంలో రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో.. కొందరు గాయకులు రామునిపై తమకున్న భక్తిని పాటల రూపంలో చాటుతున్నారు. తమకున్న సింగింగ్ ట్యాలెంట్కు భక్తిని జోడించి..
![Ram Mandir: హరిహరన్ రామభజనపై ప్రధాని మోదీ ప్రశంసలు.. అందరినీ రాముని భక్తిలో..](https://media.andhrajyothy.com/media/2023/20231205/PM_Modi_On_Hariharan_f316bbd5ee.jpg)
PM Modi On Hariharan Ram Bhaja: అయోధ్యలోని రామమందిరంలో రామ్లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో.. కొందరు గాయకులు రామునిపై తమకున్న భక్తిని పాటల రూపంలో చాటుతున్నారు. తమకున్న సింగింగ్ ట్యాలెంట్కు భక్తిని జోడించి.. రాముని భక్తిలో మైమరిపోయేలా మధురమైన భక్తిగీతాలను విడుదల చేస్తున్నారు. ప్రముఖ గాయకుడు హరిహరన్ సైతం ఇటీవల రామ భజనని పాడారు. ఈ పాటకు సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి.
తాజాగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎక్స్ వేదికగా ఈ రామ భజనను ప్రశంసించారు. ఇది అందరినీ రాముని భక్తిలో ముంచెత్తుతుందని పేర్కొంటూ.. ఆ రామభజనని పంచుకున్నారు. “తన అద్భుత రాగాలతో హరిహరన్ ఆలపించిన ఈ రామ భజన.. ప్రతి ఒక్కరినీ శ్రీరాముని భక్తిలో ముంచెత్తుతుంది. మీరు కూడా ఈ అందమైన భజనను తప్పక ఆస్వాదించండి” అని ఎక్స్ వేదికగా పేర్కొంటూ.. ఆ భక్తిగీతానికి సంబంధించిన యూట్యూబ్ లింక్ ప్రధాని మోదీ షేర్ చేశారు. మంగళవారం ఉదయం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.
గతంలోనూ గుజరాతీ జానపద గాయని గీతా రాబరీ పాడిన ‘‘శ్రీరామ్ ఘర్ ఆయే’’ భజనని సైతం మోదీ ప్రశంసించారు. ఈ పాటను ఉద్వేగభరితంగా ఉందని పేర్కొంటూ.. అయోధ్యలోని శ్రీరాముడి దివ్యమైన ఆలయంలో రామ్లల్లా ప్రతిష్టాపన వేడుక కోసం దేశవ్యాప్తంగా నా కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. అంతకుముందు.. స్వస్తి మెహుల్, జుబిన్ నౌటియల్, హన్స్రాజ్ రఘువంశీ, స్వాతి మిశ్రా పాడిన భక్తి పాటలను సైతం ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇదిలావుండగా.. జనవరి 22వ తేదీన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. జనవరి 16వ తేదీ నుంచి వైదిక కర్మలు ప్రారంభం కానున్నాయని, ప్రధాన వేడుకు ప్రారంభమయ్యే దాకా అంటే ఏడు రోజుల పాటు అవి కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీ కాంత్ దీక్షిత్ జనవరి 22న ముడుపుల ప్రధాన ఆచారాలను నిర్వహిస్తుండగా.. ప్రధాని మోదీ ఆలయ విగ్రహ ప్రతిష్టాపనను అలంకరించనున్నారు.