Share News

Republic Day 2024: ఫ్రాన్స్ అధ్యక్షుడి స్వాగతానికి ఏర్పాట్లు పూర్తి.. కీలకాంశాలు చర్చించనున్న మోదీ - మాక్రాన్

ABN , Publish Date - Jan 24 , 2024 | 06:46 PM

ప్రతి ఏడాదిలాగే ఈ గణతంత్ర దినోత్సవానికి(India Republic Day 2024) ఢిల్లీలో జరిగే పరేడ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ముఖ్య అతిథి రాబోతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌(Emmanuel Macron)కు ఈ మేరకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు.

Republic Day 2024: ఫ్రాన్స్ అధ్యక్షుడి  స్వాగతానికి ఏర్పాట్లు పూర్తి.. కీలకాంశాలు చర్చించనున్న మోదీ - మాక్రాన్

ఢిల్లీ: ప్రతి ఏడాదిలాగే ఈ గణతంత్ర దినోత్సవానికి(India Republic Day 2024) ఢిల్లీలో జరిగే పరేడ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ముఖ్య అతిథి రాబోతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌(Emmanuel Macron)కు ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానం పంపింది. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. ప్రధాని మోదీ(PM Modi) ఆయన్ని జైపుర్‌లో రిసీవ్ చేసుకుని ఢిల్లీ వరకు తీసుకురానున్నారు. 2023 జులైలో ప్యారిస్‌లో జరిగిన బాస్టిల్ డే(Bastil Day) పరేడ్‌కు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిని భారత్‌కు ఆహ్వానించడం.. దానికి ఆయన అంగీకరించడం అన్ని చకచక జరిగిపోయాయి.

ఫ్రెంచ్ నేతలు ఎంతో ప్రాధాన్యంగా భావించే జంతర్ మంతర్ ప్రాంతాన్ని మాక్రాన్, మోదీతో కలిసి సందర్శిస్తారు. అనంతరం సంగనేరి గేట్ వరకు ఇరువురు నేతలు రోడ్ షోలో పాల్గొంటారు. తరువాత రాంబాగ్ ప్యాలెస్‌లో మాక్రాన్‌కు మోదీ విందు ఏర్పాటు చేస్తారు. కర్తవ్య పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరవుతారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో విన్యాసాలు చేసేందుకు ఫ్రెంచ్ సైన్యం సిద్ధమైంది. పరేడ్ ముగిసిన తర్వాత మాక్రాన్ ఢిల్లీలోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడతారు.


సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమంలో పాల్గొంటారు. గణతంత్ర వేడుకల అనంతరం 26 రాఫెల్ నౌకాదళ విమానాల కొనుగోలుపై రెండు దేశాలు ఉమ్మడి ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. గతంలోనూ పలువురు ఫ్రెంచ్ అధ్యక్షులు భారత గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. వారిలో ఫ్రాంకోయిస్ హోలాండ్ (2016), నికోలస్ సర్కోజీ (2008), జాక్వెస్ చిరాక్ (1998), వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్ (1980)లు ఉన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ వస్తున్న ఆరో అధ్యక్షుడిగా మాక్రాన్ నిలవనున్నారు.

2009 బాస్టిల్ డే పరేడ్‌కు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. 2023లో జరిగిన కవాతుకు ప్రధాని మోదీ వెళ్లారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, అంతరిక్షం తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి. ఇటీవల భారత్-ఫ్రాన్స్‌లు తీవ్రవాద వ్యతిరేకత, సముద్ర భద్రత, వాతావరణ మార్పు, పునరుత్పాదక - స్థిరమైన అభివృద్ధి, డిజిటలైజేషన్, సైబర్ భద్రత వంటివాటిపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. మారుతున్న ప్రపంచం, సంక్లిష్ట భౌగోళిక రాజకీయ వాతావరణం, సంబంధిత జాతీయ ఆశయాల సాధనలో ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాయి.

Updated Date - Jan 25 , 2024 | 05:11 PM