MP Gautam Shikhamani: ఎంపీ గౌతం శిఖామణిపై అభియోగాల నమోదు వాయిదా
ABN , Publish Date - Jan 05 , 2024 | 10:08 AM
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నమోదు చేసిన ఫెరా ఉల్లంఘన కేసులో కళ్ళకుర్చి ఎంపీ, మాజీ మంత్రి పొన్ముడి కుమారుడు గౌతం శిఖామణి(MP Gautam Shikhamani) గురువారం కోర్టుకు హాజరుకాలేదు.
![MP Gautam Shikhamani: ఎంపీ గౌతం శిఖామణిపై అభియోగాల నమోదు వాయిదా](https://media.andhrajyothy.com/media/2023/20231205/nani6_35a5f069d8.jpg)
అడయార్(చెన్నై): ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నమోదు చేసిన ఫెరా ఉల్లంఘన కేసులో కళ్ళకుర్చి ఎంపీ, మాజీ మంత్రి పొన్ముడి కుమారుడు గౌతం శిఖామణి(MP Gautam Shikhamani) గురువారం కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఆయనపై అభియోగాల నమోదును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. విల్లుపురం జిల్లాలో ప్రభుత్వ అనుమతులకు మించి ఎర్రమట్టి తవ్వకాలు జరిపి ప్రభుత్వ ఖజానాకు రూ.28.36 కోట్ల నష్టం చేకూర్చారన్న కేసులో మాజీ మంత్రి పొన్ముడిని మద్రాస్ హైకోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులు ఆధారంగా చేసుకుని పొన్ముడి కుమారుడు గౌతం శిఖామణితో పాటు మరికొందరు ఇళ్ళలో తనిఖీలు చేసి కీలక దస్తావేజులతోపాటు విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పైగా ఫెరా చట్ట నిబంధనలు ఉల్లంఘించి విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. దీంతో ఆయనకు చెందిన బ్యాంకు డిపాజిట్లతో పాటు కొంత నగదును కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసు విచారణ మద్రాస్ హైకోర్టులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో సాగుతుండగా, గురువారం న్యాయమూర్తి మలర్వాణన్ సమక్షంలో విచారణకు రాగా, గౌతం శిఖామణి మినహా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా హాజరయ్యారు. గౌతం శిఖామణి హాజరుకాకపోవడంతో వారిపై అభియోగాల నమోదును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.