Share News

Delhi: కాళ్ల పారాణి ఆరకముందే.. గుండెపోటుతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:08 PM

కొన్ని బంధాలు మరణంలో కూడా తోడుగా ఉంటాయి. ప్రేమించే వ్యక్తి దూరమైతే ఆ బాధ ఎంతలా వేధిస్తుందో తెలియనిది కాదు. అలాంటి ఓ జంట విషాదంగా తమ జీవితాన్ని ముగించిన ఘటనే ఈ వార్త. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కి చెందిన అభిషేక్(25), అంజలి(23)కి నెల రోజుల క్రితం వివాహం అయింది. వీరు ఫిబ్రవరి 26న ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు సందర్శించడానికి వెళ్లారు.

Delhi: కాళ్ల పారాణి ఆరకముందే.. గుండెపోటుతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే

ఢిల్లీ: కొన్ని బంధాలు మరణంలో కూడా తోడుగా ఉంటాయి. ప్రేమించే వ్యక్తి దూరమైతే ఆ బాధ ఎంతలా వేధిస్తుందో తెలియనిది కాదు. అలాంటి ఓ జంట విషాదంగా తమ జీవితాన్ని ముగించిన ఘటనే ఈ వార్త. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కి చెందిన అభిషేక్(25), అంజలి(23)కి నెల రోజుల క్రితం వివాహం అయింది. వీరు ఫిబ్రవరి 26న ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు సందర్శించడానికి వెళ్లారు. ఓ జూ దగ్గరకు వెళ్లగానే అభిషేక్‌కు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు.

అప్రమత్తమైన అంజలి తన స్నేహితుల సాయంతో భర్తను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ మృతి చెందాడు. భర్త మరణంతో అంజలి గుండెలవిసేలా రోదించింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఘజియాబాద్‌కి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయసాగారు. భర్త మృతిని తట్టుకోలేకపోయిన అంజలి తాను నివసిస్తున్న భవనంలో ఏడో అంతస్థు నుంచి కిందకు దూకింది.


ఈ ఘటనలో ఆమె తీవ్ర గాయాలపాలైంది. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అభిషేక్ బంధువు బబిత మాట్లాడుతూ.. "మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అంజలి భర్త లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. వెంటనే లేచి బాల్కనీ వైపు పరుగెత్తింది. ఆమె ఆత్మహత్య చేసుకోబోతోందని గమనించి నేను గట్టిగా అరిచాను. ఇతరులు అప్రమత్తం అయ్యేలోపు ఈ దారుణం చోటు చేసుకుంది" అని ఆవేదన వ్యక్తం చేసింది. భార్యభర్తలిద్దరూ 24 గంటల్లో మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గుండెపోటు మరణాలపై ఆందోళనలు..

అభిషేక్ గుండెపోటుతో మృతి చెందడంతో డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా తరువాత చాలా మంది గుండెలు బలహీనంగా మారాయని డాక్టర్లు అంటున్నారు. వ్యాయామం చేస్తూ కుప్పకూలిన ఉదంతాలు అనుభవంలో ఉన్నవే. గుండెపోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ, సమయానికి నిద్ర పోతూ, శరీరానికి అవసరమైన మేర వ్యాయామం చేస్తే గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 27 , 2024 | 01:08 PM