LS polls 2024: వ్యూహాత్మకంగా కాంగ్రెస్.. స్వతంత్రంగా 290 సీట్లలో పోటీ..?
ABN , Publish Date - Jan 01 , 2024 | 05:17 PM
లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లలో స్వతంత్రంగా పోటీ చేయాలనే అంశంపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సుమారు 290 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. రెండ్రోజుల పాటు డిసెంబర్ 29-30 తేదీల్లో జరిగిన అలయెన్స్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు.
![LS polls 2024: వ్యూహాత్మకంగా కాంగ్రెస్.. స్వతంత్రంగా 290 సీట్లలో పోటీ..?](https://media.andhrajyothy.com/media/2023/20231205/kharge_9bd7a13252.jpg)
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో (Loksabha polls 2024) ఎన్ని సీట్లలో స్వతంత్రంగా పోటీ చేయాలనే అంశంపై కాంగ్రెస్ (Congress) వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సుమారు 290 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. రెండ్రోజుల పాటు డిసెంబర్ 29-30 తేదీల్లో జరిగిన అలయెన్స్ కమిటీ (Alliance Committee) సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు.
కూటమి వ్యూహాలను రూపొందించేందుకు ఏర్పాటైన అలయెన్స్ కమిటీ ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించనుంది. దీనికి ముందుగా, జనవరి 4న ఆయన ఒక కీలక సమావేశాన్ని ఖర్గే ఏర్పాటు చేయబోతున్నారు. సీట్ల పంపకాల ఏర్పాట్లను ఖరారు చేసేందుకు అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో ఆయన ఈ సమావేశంలో చర్చించనున్నారు.
కాగా, దేశవ్యాప్తంగా తమ భాగస్వామ్య పార్టీల నుంచి 85 లోక్సభ సీట్లను కాంగ్రెస్ పార్టీ కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. పార్టీ అంతర్గత చర్చలు అనంతరం భాగస్వామ్య పార్టీలతో సీట్ల పంపకాల ఒప్పందాన్ని స్థిరపరచేందుకు తదుపరి సంప్రదింపులు జరుపనుంది. తద్వారా కూటమి భాగస్వామ్య పార్టీలను మరింత బలపడేలా చేస్తూనే గరిష్టంగా ఎన్నికల గెలుపు అవకాశాలను మరింత పెంచుకోవాలని కాంగ్రెస్ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.