Share News

ఇండియాకు మమత షాక్‌

ABN , Publish Date - Mar 11 , 2024 | 08:22 AM

పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అధికార పక్షం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. తద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పింది.

ఇండియాకు మమత షాక్‌

  • కోల్‌కతాలో జనగర్జన సభలో మమత, ఆమె వెంట నడుస్తున్న టీఎంసీ ఎంపీ అభ్యర్థులు

  • బెంగాల్‌లో అన్ని లోక్‌సభ స్థానాలకు తృణమూల్‌ అభ్యర్థుల ప్రకటన.. జాబితా విడుదల

  • మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌,

  • సినీ నటి రచనా బెనర్జీలకు చోటు

  • ఏడుగురు సిటింగ్‌లకు మొండిచేయి

న్యూఢిల్లీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అధికార పక్షం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. తద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పింది. అభ్యర్థులుగా మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌, సినీ హీరోయిన్‌ రచనాబెనర్జీ వంటి కొత్త ముఖాలకు తృణమూల్‌ అవకాశం కల్పించింది. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న బర్హంపూర్‌ నుంచి యూసుఫ్‌ పఠాన్‌ను బరిలో దింపటం గమనార్హం. ప్రశ్నలకు డబ్బులు ఆరోపణలపై లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన మహువా మొయిత్రాకు ఆమె సిటింగ్‌ స్థానమైన కృష్ణనగర్‌ నుంచే మరోసారి అవకాశం కల్పించారు.

తాజాగా వివాదాస్పదమైన సందేశ్‌ఖాలీ ప్రాంతం ఉన్న బసీరత్‌ స్థానం నుంచి సిటింగ్‌ ఎంపీ, నటి నుస్రత్‌ జహాన్‌ బదులు మాజీ ఎంపీ హజీ నూరుల్‌ ఇస్లాంకు అవకాశం ఇచ్చారు. కాగా తృణమూల్‌కున్న 23 మంది ఎంపీల్లో 16 మందికి తిరిగి అవకాశం ఇచ్చి ఏడుగురిని పక్కన పెట్టారు. ఇద్దరు క్యాబినెట్‌ మంత్రులతోపాటు 9 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలను ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల బరిలో దింపారు. మొత్తం 42 మంది అభ్యర్థుల్లో 12 మంది మహిళలున్నారు. కాగా, ఆదివారం కోల్‌కతాలో మమత జనగర్జన పేరుతో భారీ బహిరంగసభలో నిర్వహించారు. బెంగాల్‌లో బీజేపీతోపాటు కాంగ్రెస్‌, సీపీఎంలను ఎదుర్కొంటామన్నారు.


పొత్తుకు ఇంకా అవకాశం ఉంది: ఖర్గే

బెంగాల్‌లో అన్ని స్థానాలకు అభ్యర్థులను తృణమూల్‌ ప్రకటించటంపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు ఖర్గే స్పందిస్తూ.. ‘మా తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయి. నామినేషన్ల ఉపసంహరణ వరకూ పొత్తుకు అవకాశం ఉంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి భయపడే కాంగ్రెస్‌తో పొత్తుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమతా బెనర్జీ ముందుకు రాలేదని, బీజేపీ వ్యతిరేక పోరాటంలో తాను లేననే సంకేతాన్ని ఆమె ఇచ్చారని అధిర్‌ రంజన్‌ చౌదరి విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాంరమేష్‌ మాట్లాడుతూ.. గౌరవప్రదమైన స్థాయిలో సీట్ల సర్దుబాటు కుదుర్చుకోవాలని తాము భావించామని, కానీ, తృణమూల్‌పై ఎటువంటి ఒత్తిడి ఉందో తమకు తెలియదన్నారు. కాగా, సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌, తృణమూల్‌ మధ్య మూడు నెలల పాటు చర్చలు జరిగాయి. కాంగ్రెస్‌ 7 సీట్లు కావాలని డిమాండ్‌ చేయగా రెండు కంటే ఎక్కువ ఇవ్వబోమని మమత తేల్చిచెప్పారు. తాజాగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

Updated Date - Mar 11 , 2024 | 08:24 AM