Ayodhya: రాములవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ కీలక నేత!
ABN , Publish Date - Jan 11 , 2024 | 07:38 AM
అయోధ్య(Ayodhya) రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి బీజేపీ(BJP) కీలక నేత హాజరుకానున్నట్లు విశ్వహిందూ పరిషత్ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది.
![Ayodhya: రాములవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ కీలక నేత!](https://media.andhrajyothy.com/media/2023/20231205/ayodhya_17a77ddef6.jpg)
అయోధ్య: అయోధ్య(Ayodhya) రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి బీజేపీ(BJP) కీలక నేత హాజరుకానున్నట్లు విశ్వహిందూ పరిషత్ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత ఎల్ కె అద్వానీ హాజరుకానున్నట్లు వీహెచ్పీ తెలిపింది. రామమందిరం 'ప్రాణ్ ప్రతిష్ఠా' రామజన్మభూమి ఉద్యమానికి నాయకత్వం వహించిన బీజేపీ నేతల్లో 96 ఏళ్ల అద్వానీ(LK Advani) ఒకరు. ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న వారిలో బీజేపీ మరో సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషితో పాటు అద్వానీ ఉన్నారు.
అయితే వారి వయస్సు, ఆరోగ్యం రీత్యా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం లేదని ఆలయ ట్రస్ట్ తొలుత తెలిపింది. తరువాత వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వీహెచ్ పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. అద్వానీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. పరిమిత ఆహ్వానితులతో, రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా వేలాది మంది ఆహ్వానాలు వెళ్లాయి.
ఆహ్వానితులలో మందిరాన్ని నిర్మించిన కార్మికుల కుటుంబాలు కూడా ఉన్నాయి. జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే ఏడు రోజుల ఉత్సవాల కోసం ఆలయ నగరి సిద్ధమవుతోంది. జనవరి 15 నాటికి సంప్రోక్షణ వేడుకకు సన్నాహాలు పూర్తవుతాయి.