Share News

Jharkhand: హైదరాబాద్ నుంచి జార్ఖండ్‌కు ఎమ్మెల్యేల తిరుగు ప్రయాణం.. బల నిరూపణ కోసమే!

ABN , Publish Date - Feb 04 , 2024 | 07:33 PM

మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న హేమంత్ సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో జార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. ఆయన రాజీనామా అనంతరం చంపై సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

Jharkhand: హైదరాబాద్ నుంచి జార్ఖండ్‌కు ఎమ్మెల్యేల తిరుగు ప్రయాణం.. బల నిరూపణ కోసమే!

మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న హేమంత్ సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో జార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. ఆయన రాజీనామా అనంతరం చంపై సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే.. సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలోని బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్‌పై ఆందోళనల నేపథ్యంలో అధికార జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి చెందిన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలంతా రాంచీకి తిరిగి బయలుదేరారు. ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకునేందుకు గాను సోమవారం ‘ఫ్లోర్ టెస్ట్’ ఉండటంతో.. ఈ ఎమ్మెల్యేలంతా తిరిగి ఆ రాష్ట్రానికి పయనమయ్యారు.


కాగా.. 81 అసెంబ్లీ స్థానాలు కలిగిన జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 41 మ్యాజిక్ ఫిగర్‌ని అందుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికార కూటమికి 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ, అందులో 43 మంది ఎమ్మెల్యేలు చంపై సోరెన్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఇక బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు.. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌ (ఏజేఎస్‌యూ) ముగ్గురు.. ఎన్సీపీ, లెఫ్ట్ పార్టీకి చెరొకరు.. స్వతంత్ర ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. అయితే.. మ్యాజిక్ ఫిగర్‌ 41ని దాటి హేమంత సోరెన్‌కు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా.. స్వల్ప మెజారిటీ మాత్రమే ఉండటంతో ఆందోళనకు దారి తీసింది. ఇద్దరు జేఎంఎం ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు డుమ్మా కొట్టొచ్చని, అదే జరిగితే మెజారిటీ మార్క్ తగ్గుతుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఈ బలనిరూపణ పరీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే.. చంపై సోరెన్ మాత్రం తమ కూటమి బలంగా ఉందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు. 43 మంది ఎమ్మెల్యేల మద్దతుతో తాము గవర్నర్‌కు నివేదికను ఇచ్చామని.. ఆ సంఖ్య 46-47కు చేరుకుంటుందని తాము భావిస్తున్నామని.. కాబట్టి ఎటువంటి సమస్య లేదని ఆయన తెలిపారు. బుధవారం సాయంత్రం హేమంత్‌ సోరెన్‌ అరెస్ట్ అవ్వడానికి ముందే.. ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సంఖ్య తమకు ఉందని నేతలు కూడా బల్లగుద్ది మరీ చెప్పారు. ఇదిలావుండగా.. భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంతో, జార్ఖండ్‌లో ఈ రాజకీయ సంక్షోభం ఏర్పడింది.

Updated Date - Feb 04 , 2024 | 09:45 PM