Share News

Bengaluru Cafe Blast: బెంగళూరు పేలుళ్లతో జగిత్యాలకు లింకు?

ABN , Publish Date - Mar 11 , 2024 | 08:08 AM

బెంగళూరు రామేశ్వరం కెఫె బాంబు పేలుళ్లతో జగిత్యాలకు లింకులున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) కార్యదర్శి అబ్దుల్‌ సలీంకు బెంగళూరు పేలుళ్ల కేసుతో సంబంధాలున్నట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది.

Bengaluru Cafe Blast: బెంగళూరు పేలుళ్లతో జగిత్యాలకు లింకు?

  • రామేశ్వరం కెఫే బాంబు పేలుళ్ల ఘటనలో

  • పీఎఫ్‌ఐ కార్యదర్శి సలీం హస్తమున్నట్లు అనుమానాలు

జగిత్యాల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు రామేశ్వరం కెఫె బాంబు పేలుళ్లతో జగిత్యాలకు లింకులున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఇస్లాంపురకు చెందిన నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) కార్యదర్శి అబ్దుల్‌ సలీంకు బెంగళూరు పేలుళ్ల కేసుతో సంబంధాలున్నట్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప జిల్లా మైదుకూరు మండలం చెర్లోపల్లి ప్రాంతంలో సలీంను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం అతణ్ని ఎన్‌ఐఏ వర్గాలు బెంగళూరు పేలుళ్ల కోణంలో విచారిస్తున్నట్లు తెలిసింది. ఎన్‌ఐఏ గతంలో విడుదల చేసిన మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలోనూ సలీం పేరు ఉంది. ఈయనతోపాటు.. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎండీ అబ్దుల్‌ అహ్మద్‌ అలియాస్‌ ఎంఏ అహ్మద్‌, ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన షేక్‌ ఇలాయాస్‌ అహ్మద్‌ మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నారు. పరారీలో ఉన్న వీరి కోసం ఎన్‌ఐఏ కొంత కాలంగా గాలిస్తోంది. గత ఏడాది ఎన్‌ఐఏ తెలంగాణ, ఏపీల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, పీఎఫ్‌ఐ శిక్షణ పొందుతున్న వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సలీం అప్పటి నుంచి పరారీలో ఉండగా.. ఇటీవల కడప జిల్లా మైదుకూరులో పట్టుబడ్డాడు.

Updated Date - Mar 11 , 2024 | 08:25 AM