Share News

New York: ఎంఆర్‌ఐ టెక్నాలజీపై గుళ్లపల్లి పూర్ణచంద్రరావు చెరగని ముద్ర

ABN , Publish Date - May 06 , 2024 | 04:19 AM

‘మ్యాగ్నెటిక్‌ రెజొనెన్స్‌ ఇమేజింగ్‌ (ఎంఆర్‌ఐ)’ టెక్నాలజీపై విస్తృతంగా పరిశోధనలు చేసి 150కి పైగా పీర్‌ రివ్యూడ్‌ పరిశోధన పత్రాలు రాసి, 13 పేటెంట్లు పొందిన మన తెలుగువాడు.. డాక్టర్‌ గుళ్లపల్లి పూర్ణచంద్రరావు. బ్రెయిన్‌ ఇమేజింగ్‌ రిసెర్చ్‌ గతినే మార్చిన ప్రతిభావంతుడిగా పేరొందిన ఆయన.. ఆ పరిశోధనల క్రమంలోనే క్యాన్సర్‌ బారిన పడి గత ఏడాది కన్నుమూశారు.

New York: ఎంఆర్‌ఐ టెక్నాలజీపై  గుళ్లపల్లి పూర్ణచంద్రరావు చెరగని ముద్ర

  • బ్రెయిన్‌ ఇమేజింగ్‌ పరిశోధనల గతినే మార్చిన గుళ్లపల్లి

  • నేడు ఆయన ప్రథమ వర్ధంతి..

  • పలువురు వైద్యుల నివాళులు

  • కెమికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌..

  • ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పీజీ పూర్తి

  • 1982లో అమెరికాకు గుళ్లపల్లి

  • అక్కడే పీహెచ్‌డీ, పరిశోధనలు

  • 150కి పైగా పీర్‌ రివ్యూడ్‌ పత్రాల ప్రచురణ.. 13 పేటెంట్లు

న్యూయార్క్‌, మే 5: ‘మ్యాగ్నెటిక్‌ రెజొనెన్స్‌ ఇమేజింగ్‌ (ఎంఆర్‌ఐ)’ టెక్నాలజీపై విస్తృతంగా పరిశోధనలు చేసి 150కి పైగా పీర్‌ రివ్యూడ్‌ పరిశోధన పత్రాలు రాసి, 13 పేటెంట్లు పొందిన మన తెలుగువాడు.. డాక్టర్‌ గుళ్లపల్లి పూర్ణచంద్రరావు. బ్రెయిన్‌ ఇమేజింగ్‌ రిసెర్చ్‌ గతినే మార్చిన ప్రతిభావంతుడిగా పేరొందిన ఆయన.. ఆ పరిశోధనల క్రమంలోనే క్యాన్సర్‌ బారిన పడి గత ఏడాది కన్నుమూశారు. సోమవారం ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా.. వైద్యరంగానికి చెందిన పలువురు నిపుణులు, శాస్త్రవేత్తలు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ, నివాళులర్పిస్తున్నారు. ఏపీలోని కృష్ణాజిల్లా ముసునూరులో 1958 ఆగస్టు 28న డాక్టర్‌ వెంకటకృష్ణారావు, రుక్మాబాయి దంపతులకు జన్మించిన పూర్ణచంద్రరావు బాల్యం, విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెమికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ పట్టా పుచ్చుకున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మినరల్స్‌ ఇంజనీరింగ్‌లో పీజీ చేసి 1982లో అమెరికాకు వెళ్లారు. అక్కడ ఆర్కన్సాస్‌ వర్సిటీలో ఎమ్మెస్‌ పూర్తిచేసి, ఇన్‌స్ట్రుమెంటల్‌ సైన్సె్‌సలో పీహెచ్‌డీ చేశారు. అనంతరం కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు.


ఆ తర్వాత క్లీవ్‌లాండ్‌ ఒహాయోలోని పికర్‌ ఇంటర్నేషనల్‌ క్లినికల్‌ పరిశోధన విభాగంలో యువ స్టాఫ్‌ సైంటి్‌స్టగా చేరి తన కెరీర్‌ను ఆరంభించారు. 1996లో యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌లో చేరి గణనీయమైన శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణలు చేశారు. ఆ వర్సిటీలోని డయాగ్నస్టిక్‌ రేడియాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌ విభాగంలో 27 సంవత్సరాలపాటు పనిచేసిన ఆయన.. ట్రామాటిక్‌ బ్రెయిన్‌ ఇంజురీ(ఎదైనా బలమైన దెబ్బ తగిలినప్పుడు మెదడుకు అయ్యే గాయాలకు) సంబంధించిన కొత్త ఇమేజింగ్‌ బయోమార్కర్లను గుర్తించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. మెదడుకు గాయమైనప్పుడు జరిగే మైక్రోస్ట్రక్చరల్‌ మార్పులను, న్యూరో ఇన్‌ఫ్లమేషన్‌ను గుర్తించేందుకు వినియోగించే ‘డిఫ్యూజన్‌ కర్టోసిస్‌ ఇమేజింగ్‌’ ఆవిష్కరణకు నేతృత్వం వహించారు. ముఖ్యంగా.. బ్రెయిన్‌ ఇంజురీ తర్వాత మెదడులో జరిగే ‘లాంగిట్యూడినల్‌ చేంజెస్‌ ఇన్‌ స్ట్రక్చర్‌ అండ్‌ ఫంక్షన్‌’పై విస్తృతంగా పరిశోధనలు చేశారు (లాంగిట్యూడినల్‌ పరిశోధనలు అంటే.. ఒకే వ్యక్తి/ఆబ్జెక్ట్‌పై సుదీర్ఘకాలంపాటు చేసే పరిశోధన). ఇమేజ్‌-గైడెడ్‌ ఇంటర్వెన్షనల్‌ టెక్నిక్స్‌ను అభివృద్ధి చేశారు.


ఆయన తయారుచేసిన ‘మినిమల్లీ ఇన్వేజివ్‌ న్యూరోసర్జికల్‌ ఇంట్రాక్రేనియల్‌ రోబో’కుగాను యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ ఔట్‌స్టాండింగ్‌ ఇన్వెన్షన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు పొందారు. ఒక ప్రొఫెసర్‌గా.. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఎంతోమంది పీహెచ్‌డీ విద్యార్థులను ముందుండి నడిపించారు. మేరీల్యాండ్‌ వర్సిటీలోని ‘సెంటర్‌ ఫర్‌ మెటబాలిక్‌ ఇమేజింగ్‌ అండ్‌ థెరపాటిక్స్‌’ డైరెక్టర్‌గా, ‘రిసెర్చ్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ద కోర్‌ ఫర్‌ ట్రాన్స్‌లేషనల్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఇమేజింగ్‌’ వైస్‌చైర్‌గా, ‘జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రోబోటిక్స్‌ రిసెర్చ్‌’ సీనియర్‌ ఎడిటర్‌గా వ్యవహరించారు. 2016లో మేరీల్యాండ్‌ వర్సిటీ ఏర్పాటు చేసిన ‘ఫోకస్డ్‌ అలా్ట్రసౌండ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’లో.. మెదడులో అంతకుముందు అలా్ట్రసౌండ్‌ ద్వారా చేరుకోలేకపోయిన భాగాలను చేరుకుని, చికిత్స చేసే అవకాశాలపై డాక్టర్‌ గుళ్లపల్లి పరిశోధనలు చేశారు. ఆ టెక్నాలజీ ద్వారా మూర్ఛ వంటి జబ్బులకు చికిత్స చేయడంపై దృష్టి సారించారు.


2022లో మేరీల్యాండ్‌ వర్సిటీ ప్రకటించిన ఎనిమిది మంది ‘ఎంపవర్‌ ప్రొఫెసర్స్‌’ జాబితాలో ఆయన కూడా ఉన్నారు. ఆ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంలో డాక్టర్‌ గుళ్లపల్లి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. ‘‘మెదడులో సమస్యల కారణంగా దశాబ్దాలపాటు చేతులు వణికిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నవారు, ఎంఆర్‌-గైడెడ్‌ ఫోకస్డ్‌ అలా్ట్రసౌండ్‌ చికిత్స తర్వాత అసలు ఎలాంటి వణుకూ లేకుండా బయటకు వస్తుంటే చూడడం కన్నా ఆనందం ఏముంటుంది? ఎలాంటి మత్తుమందూ ఇవ్వకుండా, స్కాల్‌పెల్‌ వాడకుండా బ్రెయిన్‌ సర్జరీ చేస్తున్నప్పుడు.. పేషెంట్‌ మెలకువగా ఉండి ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుంటే.. ఆ చికిత్స చేసే బృందంలో మనం కూడా భాగమైతే.. ఆ ఉత్సాహం ఇంకా ఎన్నో సాధించేలా మనను పురిగొల్పుతుంది’’ అని పేర్కొన్నారు. ఆయనకు భార్య ఆశ, కుమార్తెలు మీరా, లేఖ ఉన్నారు. డాక్టర్‌ పూర్ణచంద్రరావు సంస్మరణార్థం ఆయన కుటుంబసభ్యులు కిమ్స్‌ ఆస్పత్రిలో ప్రతిభావంతులైన పది మంది వైద్యులకు 1000 డాలర్ల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశారు.

Updated Date - May 06 , 2024 | 04:19 AM