Share News

Garlic: వామ్మో వెల్లుల్లి.. కిలో రూ.400 దాటేసిందిగా..

ABN , Publish Date - Feb 15 , 2024 | 01:33 PM

ఒకసారి టమోటా.. మరోసారి ఉల్లి.. ధరలు ఆకాశన్నంటి వినియోగదారుల్లో గుబులు పుట్టించగా ఈసారి వెల్లుల్లి వంతు వచ్చింది. రాష్ట్రంలో దాదాపు నాలుగు నెలలుగా వెల్లుల్లి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

Garlic: వామ్మో వెల్లుల్లి.. కిలో రూ.400 దాటేసిందిగా..

బెంగళూరు: ఒకసారి టమోటా.. మరోసారి ఉల్లి.. ధరలు ఆకాశన్నంటి వినియోగదారుల్లో గుబులు పుట్టించగా ఈసారి వెల్లుల్లి వంతు వచ్చింది. రాష్ట్రంలో దాదాపు నాలుగు నెలలుగా వెల్లుల్లి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కిలో వెల్లుల్లి చిల్లర ధర రూ. 400కు చేరుకుంది. వెల్లుల్లి ధరలు అమాంతం పెరుగుతుండటంతో మసాలాల్లో దీని వాడకాన్ని బాగా తగ్గించేశారు. రాజధాని బెంగళూరు(Bangalore)లోని కొన్ని హోటళ్లయితే వెల్లుల్లి వాడటం లేదని, వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. బెంగళూరు యశ్వంతపురంలోని ఏపీఎంసీ మార్కెట్‌కు వెల్లుల్లిపాయల రాక దాదాపు 50 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం నాణ్యమైన వెల్లుల్లి ధర ఈ మార్కెట్‌లో సగటున రూ. 350-400 పలుకుతోంది. బెంగళూరు రిటైల్‌ వెల్లుల్లి వర్తకుల సంఘం కార్యదర్శి దీపక్‌ జె.షా నగరంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ యశ్వంతపురం ఏపీఎంసీ మార్కెట్‌కు గతంలో 40 కిలోల బరువు కలిగిన 3వేలకు పైగా బస్తాల వెల్లుల్లి వచ్చేదని, ప్రస్తుతం ఇది 1200 కు తగ్గిపోయిందన్నారు. ఉత్తరభారత్‌ దేశంలో కరువు పరిస్ధితి కారణంగానే పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గిందన్నారు. రాష్ట్రంలోని హావేరి జిల్లాలో మాత్రమే వెల్లుల్లిని అధికంగా పండిస్తారు. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌(Madhya Pradesh, Gujarat, Rajasthan) నుంచి వెల్లుల్లి దిగుబడి అధికంగా ఉంటుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ నుంచి మాత్రమే వెల్లుల్లి దిగుమతి అవుతోందని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరు నాటికి మిగిలిన రెండు రాష్ట్రాల నుంచి కూడా వెల్లుల్లి దిగుమతి పెరిగే అవకాశం ఉందని, అంతవరకు ధరలు ఇలాగే ఉంటాయని భావిస్తున్నట్లు మార్కెట్‌వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Feb 15 , 2024 | 01:33 PM