Share News

Alliance of India : ఇండియా కొంప ముంచిన స్నేహపూర్వక పోటీ!

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:51 AM

‘‘బీజేపీని దెబ్బతీయాలంటే.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలి. మనలో మనం పోటీ పడకూడదు..’’ గత ఏడాది జూలై 17న బెంగళూరులో జరిగిన ఇండియా కూటమి(40 పార్టీలు) సమావేశంలో

Alliance of India : ఇండియా కొంప ముంచిన స్నేహపూర్వక పోటీ!

లేకుంటే కాంగ్రెస్‌ ఖాతాలో మరికొన్ని సీట్లు

ఉమ్మడి అభ్యర్థులున్న చోట ఘన విజయం

హిందీబెల్ట్‌లో ఫలించిన కాంగ్రెస్‌ వ్యూహం

మిత్రుల పోటీతో పంజాబ్‌, బెంగాల్‌లో నష్టం

‘‘బీజేపీని దెబ్బతీయాలంటే.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలి. మనలో మనం పోటీ పడకూడదు..’’ గత ఏడాది జూలై 17న బెంగళూరులో జరిగిన ఇండియా కూటమి(40 పార్టీలు) సమావేశంలో సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయం ఇది..! ఆ తర్వాత ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ముంబైలో జరిగిన సమావేశంలోనూ ఇదే అంశంపై చర్చ జరిగింది..! క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని రాష్ట్రాల్లో ఇది సాధ్యం కాలేదు. ‘స్నేహపూర్వక పోటీ’ని కూటమి పక్షాలు ప్రకటించుకున్నాయి. ఇప్పుడు ఆ స్నేహ పూర్వక పోటీలే కూటమి కొంప ముంచాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మిత్రుల మధ్య పోటీతో నష్టం

ఇండియా కూటమిలోని వంచిత్‌ బహుజన్‌ ఆఘాడీ వంటి పలు చిన్న పార్టీలు కొన్ని చోట్ల కాంగ్రె్‌సపై తమ అభ్యర్థులను నిలిపాయి. వీటి ద్వారా కొంత మేర నష్టం జరగ్గా.. కేరళ, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌లలో మాత్రం పూడ్చలేని నష్టం వాటిల్లింది. ‘ఉమ్మడి అభ్యర్థి’ నిబంధనకు కట్టుబడి ఉంటే.. కాంగ్రెస్‌ కూటమికి ఈ మూడు రాష్ట్రాల్లో అదనంగా 11-16 సీట్లు వచ్చి ఉండేవని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ స్నేహపూర్వక పోటీ పంజాబ్‌లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయాన్ని కట్టబెట్టింది. ఖదూర్‌సాహి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి 3.76 లక్షల ఓట్లు రాగా.. అక్కడి అప్‌-కాంగ్రె్‌సకు వచ్చిన ఓట్ల మొత్తం 5.25 లక్షలకు పైనే..! ఫరీద్‌కోటాలో కూడా 2.96 లక్షలతో ఇండిపెండెంట్‌ అభ్యర్థి అగ్రస్థానంలో నిలవగా.. అక్కడ కాంగ్రెస్‌, ఆప్‌కు వచ్చిన ఓట్ల మొత్తం 3.8 లక్షలు. బఠిండాలో శిరోమణి అకాలీదళ్‌ 3.75లక్షలతో విజయం సాధించగా.. అక్కడ కూడా ఆప్‌-కాంగ్రె్‌సలకు వచ్చిన ఓట్ల సంఖ్య 5.25 లక్షలు. పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమిలోని టీఎంసీ, కాంగ్రెస్‌, సీపీఎం పరస్పర పోటీ వల్ల 8-10 సీట్లలో బీజేపీ పాగా వేసింది. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లతో పోలిస్తే.. విడివిడిగా కూటమికి వచ్చిన ఓట్ల సంఖ్య చాలా ఎక్కువ కావడం గమనార్హం..! కేరళలోని త్రిషూర్‌ నియోజకవర్గం నుంచి నటుడు, బీజేపీ అభ్యర్థి సురేశ్‌గోపీ ఘనవిజయం సాధించారు. అక్కడ కమ్యూనిస్టులకు, కాంగ్రె్‌సకు వచ్చిన మొత్తం ఓట్ల కంటే.. సురేశ్‌గోపీ సాధించిన ఓట్లు దాదాపు 2.06 లక్షల మేర తక్కువ కావడం గమనార్హం. కేరళలో కాంగ్రెస్‌ గెలిచిన స్థానాల్లో చాలా వరకు కమ్యూనిస్టులే రెండో స్థానంలో ఉన్నారు. అక్కడ విడివిడిగా పోటీచేయకుండా ఉండిఉంటే.. భారీ మెజారిటీ వచ్చేదనేది నిర్వివాదాంశం.

ఆ రాష్ట్రాల్లో గ్రాండ్‌ సక్సెస్‌..!

ప్రీపోల్‌ సర్వేలు మొదలు.. ఎగ్జిట్‌ పోల్స్‌ దాకా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ హవా అంటూ ఫలితాలొచ్చాయి. మంగళవారం నాటి ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. 80 స్థానాలున్న యూపీలో ఇండియా కూటమిదే పైచేయి అయ్యింది. 2014లో 77, 2019లో 62 సీట్లను సాధించిన బీజేపీ ఈ సారి 33 స్థానాలకే పరిమితమైంది. ఇందుక్కారణం.. ‘ఉమ్మడి అభ్యర్థి’ నిబంధనకు కట్టుబడి ఉండడమే..! బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో ఈ ప్రయోగంతో గ్రాండ్‌ సక్సెస్‌ అయినట్లే. అంతేకాదు.. మహా వికాస్‌ ఆఘాడీ పేరుతో ముందు నుంచి కూటమిగా ఉన్న కాంగ్రెస్‌, ఎన్‌సీపీ(శరద్‌ వర్గం), శివసేన(ఉద్ధవ్‌ వర్గం) 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలోనూ ‘ఉమ్మడి’ ధర్మాన్ని పాటించాయి. ఫలితంగా 29 స్థానాల్లో ఘనవిజయం సాధించాయి. రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనూ ఈ ప్రయోగం ఫలించింది. హిందీబెల్ట్‌లో ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ మినహా.. ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. గత ఎన్నికల్లో ఈ బెల్ట్‌లో బీజేపీ ఏకపక్ష హవా కొనసాగిన విషయం తెలిసిందే..!

భారీగా పుంజుకున్న కాంగ్రెస్‌

2014, 2019 ఎన్నికలతో పోలిస్తే.. కాంగ్రెస్‌ ఈసారి పుంజుకుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా 99 స్థానాల్లో విజయం సాధించింది. నిజానికి 2014లో 44 సీట్లు.. 2019లో 52 స్థానాలను మాత్రమే సాధించిన కాంగ్రెస్‌.. లోక్‌సభలో విపక్ష పార్టీ హోదాను కూడా దక్కించుకోలేదు. ఓ దశలో బీజేపీ దూకుడుతో క్రమంగా కాంగ్రెస్‌ కనుమరుగవుతోందా? అనే అనుమానాలు రాజకీయవర్గాల నుంచి వ్యక్తమైన నేపథ్యంలో.. రాహుల్‌గాంధీ రెండుసార్లు చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’లు ప్రజల్లో మళ్లీ ఆదరణను తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా దక్షిణాదిన కేరళలో తిరిగి తన సత్తాను చాటుకోగా.. హిందీబెల్ట్‌లో ఆశించిన స్థాయిలో పురోగతిని నమోదు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లోగా ఆ పార్టీ మరింత వేగంగా పుంజుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Jun 05 , 2024 | 04:51 AM