Share News

Former CM: మాజీసీఎంకు షాకిచ్చిన హైకోర్టు.. విషయం ఏంటంటే...

ABN , Publish Date - Jan 12 , 2024 | 08:39 AM

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం (O. Panneerselvam)కు హైకోర్టు షాకిచ్చింది. అన్నాడీఎంకే పతాకం, చిహ్నం, లెటర్‌ పాడ్‌ తదితరాలను ఓపీఎస్‌ వినియోగంపై విధించిన స్టే చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది.

Former CM: మాజీసీఎంకు షాకిచ్చిన హైకోర్టు.. విషయం ఏంటంటే...

- అన్నాడీఎంకే పతాకం వినియోగంపై స్టే సబబేనని స్పష్టీకరణ

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం (O. Panneerselvam)కు హైకోర్టు షాకిచ్చింది. అన్నాడీఎంకే పతాకం, చిహ్నం, లెటర్‌ పాడ్‌ తదితరాలను ఓపీఎస్‌ వినియోగంపై విధించిన స్టే చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. 2022 జూలై 11వ తేది జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఓపీఎస్‌ సహా నలుగురిని పార్టీ నుంచి తొలగించగా, పళనిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానాలను వ్యతిరేకిస్తూ ఓపీఎస్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు, పళనిస్వామి సహా నలుగురి తొలగింపుపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకే జెండా, చిహ్నం, లెటర్‌ పాడ్‌ ఓపీఎస్‌ వర్గీయులు వినియోగించడంపై స్టే విధించాలని కోరుతూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దాన్ని విచారించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. ఓపీఎస్‌ అన్నాడీఎంకే పతాకం వినియోగించడంపై స్టే విధించారు. ఓపీఎస్‌ దీనిని సవాల్‌ చేస్తూ.. ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌, జస్టిస్‌ మహమ్మద్‌ షఫీక్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. అన్నాడీఎంకే పతాకం, చిహ్నం, లెటర్‌ పాడ్‌ తదితరాలను ఒ.పన్నీర్‌సెల్వం వినియోగించరాదంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఓపీఎస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు ప్రకటించింది. అయితే ఓపీఎస్‌ అవసరమైతే మళ్లీ సింగిల్‌ జడ్జిని ఆశ్రయించుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

నమ్మకద్రోహానికి సరైన శిక్ష: అన్నాడీఎంకే

అన్నాడీఎంకేకు నమ్మకద్రోహం చేసిన ఓపీఎ్‌స కు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సరైన శిక్ష విధించిందని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్‌ వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుపై జయకుమార్‌ స్పందిస్తూ.. అన్నాడీఎంకే కార్యాలయంపై గూండాలతో వచ్చి దాడి చేసిన ఓపీఎస్‌... ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఇకనైనా తమ పార్టీ పతాకాలు వినియోగించరాదని చెప్పారు.

Updated Date - Jan 12 , 2024 | 08:39 AM