Share News

Uttarakhand: నైనిటాల్‌లో కార్చిచ్చు.. భారత ఆర్మీ రంగంలోకి

ABN , Publish Date - Apr 28 , 2024 | 04:13 AM

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలోని అడవిలో 36 గంటలుగా చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు భారత వైమానిక దళం, భారత ఆర్మీ రంగంలోకి దిగాయి.

Uttarakhand: నైనిటాల్‌లో కార్చిచ్చు.. భారత ఆర్మీ రంగంలోకి

36 గంటలుగా మండుతున్న అడవి.. 31 చోట్ల అగ్ని ప్రమాదాలు

  • వైమానికదళం, సైన్యం రంగంలోకి

న్యూఢిల్లీ, నైనిటాల్‌, ఏప్రిల్‌ 27: ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలోని అడవిలో 36 గంటలుగా చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు భారత వైమానిక దళం, భారత ఆర్మీ రంగంలోకి దిగాయి. అగ్నిమాపక చర్యల కోసం జిల్లా యంత్రాంగం హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది. నైనిటాల్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెలరేగిన అగ్నికీలలు పైన్స్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న హైకోర్టు కాలనీ వరకు వ్యాపించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పైన్స్‌ పమీపంలో ఉన్న పాత, ఖాళీ ఇంటిని మంటలు చుట్టుముట్టాయని ఆ ప్రాంతానికి చెందిన వాసి, హైకోర్టు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ అనిల్‌ జోషి తెలిపారు.


అయితే దీనివల్ల హైకోర్టు కాలనీకి ఎలాంటి నష్టం జరగలేదు కానీ, భవనాల సమీపంలో అగ్నికీలలు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. కాగా, పైన్స్‌ సమీపంలో ఉన్న భారత ఆర్మీ స్థావరాలకు కూడా మంటలు చేరువయ్యాయి. వాటిని అదుపు చేయడానికి భారత వైమానిక దళం ఎంఐ-17 వి5 హెలికాప్టర్‌ ద్వారా బాంబి బకెట్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. దీనికోసం భీమ్‌ తాల్‌ సరస్సు నుంచి నీటిని తీసుకెళ్లింది.

అగ్ని ప్రమాదం కారణంగా నైనిటాల్‌ జిల్లా యంత్రాంగం నైని సరుస్సులో బోటింగ్‌ను నిషేధించింది. కేంద్ర బలగాలతో కలిసి 40 మంది అటవీశాఖ సిబ్బంది మంటలు అదుపుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా ఈ నెల 26న రుద్రప్రయాగ్‌లో అడవులకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలో గత 24 గంటల్లో 31 చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి. రాష్ట్రంలో కార్చిచ్చులతో గతేడాది నవంబరు 1 నుంచి ఇప్పటి వరకు 689.89 హెక్టార్లలో అటవీ ప్రాంతం దెబ్బతింది.


భారత్‌లో కార్చిచ్చు కొత్తేమీ కాదు..

అడవుల్లో మంటలు చెలరేగడం బారత్‌లో కొత్తేమీ కాదు. కొండప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చులు చెలరేగే అవకాశం ఎక్కువ. 2024 ఫిబ్రవరిలో అరుణాచల్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒడిశాలోని అడవుల్లో 2023 మార్చిలో 96 అగ్నిప్రమాదాలు సంభవించాయి. 2022 నుంచి 2023 వరకు అటవీ ప్రాంతాల్లో 871చోట్ల మంటలు చెలరేగాయి. ప్రముఖ పర్యాటక కేంద్రమైన గోవాలో 2023లో 348 హెక్టార్ల అటవీభూమి దగ్ధమైంది. 2019లో కర్ణాటకలోని బందీపూర్‌ అడవుల్లో కార్చిచ్చు చెలరేగి 3 వేల హెక్టార్లు దగ్ధమైంది.

Updated Date - Apr 28 , 2024 | 11:11 AM