Share News

Champai Soren: చంపయి సోరెన్ సీఎం క్రెడిట్ మోదీదే... ఎందుకంటే

ABN , Publish Date - Feb 02 , 2024 | 06:09 PM

జార్ఖాండ్‌లో చేటుచేసుకున్న అనూహ్య పరిణామాల మధ్య జేఎంఎం ఉపాధ్యక్షుడు చంపయి సోరెన్ ముఖ్యమంత్రిగా శుక్రవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఆసక్తికరంగా, మోదీ క్రెడిట్ వల్లే చంపయి సోరెన్‌ ముఖ్యమంత్రి అయినట్టు బీజేపీ అభివర్ణించింది. దేశంలో ఆనువంశిక రాజకీయాలకు వ్యతిరేకమైన వాతావరణం ఉండటం వల్లే చంపయి సోరెన్ సీఎం అయినట్టు తెలిపింది.

Champai Soren: చంపయి సోరెన్ సీఎం క్రెడిట్ మోదీదే... ఎందుకంటే

రాంచీ: జార్ఖాండ్‌లో చేటుచేసుకున్న అనూహ్య పరిణామాల మధ్య జేఎంఎం ఉపాధ్యక్షుడు చంపయి సోరెన్ (Champai Soren) ముఖ్యమంత్రిగా శుక్రవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఈడీ అరెస్టుతో ముఖ్యమంత్రికి పదవికి హేమంత్ సోరెన్ (Hemant Soren) రాజీనామా చేయడం, జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన చంపయి సోరెన్ కొత్త సీఎంగా పగ్గాలు చేపట్టడం వంటి పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. ఆసక్తికరంగా, మోదీ క్రెడిట్ వల్లే చంపయి సోరెన్‌ ముఖ్యమంత్రి అయినట్టు బీజేపీ అభివర్ణించింది. దేశంలో ఆనువంశిక రాజకీయాలకు వ్యతిరేకమైన వాతావరణం ఉండటం వల్లే చంపయి సోరెన్ ముఖ్యమంత్రి అయినట్టు జార్ఖాండ్ అసెంబ్లీలో విపక్ష నేత అమర్ కుమార్ బావురీ అన్నారు.


నాలుగేళ్ల క్రితం హేమంత్ సోరెన్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిందని, అప్పట్నించి ప్రభుత్వం అనేక లీగల్ చిక్కుల్లో పడిందని బవురి తెలిపారు. చంపయి సోరెన్ ముఖ్యమంత్రి కావడానికి ఇదొక కారణమని అన్నారు. దీనికి మరో ప్రధాన కారణంగా ఉందని, ఆనువంశిక పాలనను ప్రధాని మోదీ మొదట్నించీ వ్యతిరేకిస్తూ వచ్చారని, ఇప్పుడు అలాంటి వాతావరణమే దేశమంతటా ఉందని చెప్పారు. ఆ కారణంగానే చంపయి సోరెన్ సీఎం అయ్యారని, ఆ క్రెడిట్ మోదీకి దక్కుతుందని చెప్పారు.


రాంచీలోని రాజ్‌భవన్‌లో చంపయి సోరెన్‌ చేత ముఖ్యమంత్రిగా గవర్నర్ సీపీ రాథాకృష్ణన్ శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ నేత సత్యానంద్ భోక్త మంత్రులుగా ప్రమాణం చేశారు. ఫిబ్రవరి 5న చంపయి సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షకు వెళ్లనుంది. 5,6 తేదీల్లో అసెంబ్లీ సమావేశం కానుంది.

Updated Date - Feb 02 , 2024 | 06:42 PM