Share News

Bangalore: అమాంతం పెరిగిన ఆస్తులు.. ఆ ఆరుగురు ఎంపీల ఆదాయం ఎన్నో రెట్లు పైపైకి..

ABN , Publish Date - Feb 24 , 2024 | 01:54 PM

రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఎంపీల ఆస్తులు గత 15 సంవత్సరాల వ్యవధిలోనే ఎన్నోరెట్లు పెరిగాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక పేర్కొంది.

Bangalore: అమాంతం పెరిగిన ఆస్తులు.. ఆ ఆరుగురు ఎంపీల ఆదాయం ఎన్నో రెట్లు పైపైకి..

- ఏడీఆర్‌ నివేదిక వెల్లడి

బెంగళూరు: రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఎంపీల ఆస్తులు గత 15 సంవత్సరాల వ్యవధిలోనే ఎన్నోరెట్లు పెరిగాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక పేర్కొంది. విజయపుర బీజేపీ ఎంపీ రమేష్‌ జిగజిణగి(BJP MP Ramesh Jigajinagi) ఆస్తి (ఎన్నికల సంఘానికి అందజేసిన అఫిడవిట్‌ ప్రకారం) 2004లో రూ. 54.80 లక్షలు ఉండగా 2009లో రూ.1.17 కోట్లకు, 2014లో రూ. 8.94 కోట్లకు 2019లో రూ. 50.41 కోట్లకు చేరుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం బెంగళూరునార్త్‌ బీజేపీ ఎంపీగా ఉన్న డీవీ సదానందగౌడకు 2004లో రూ.46.30 లక్షల మేరకు ఆస్తులు ఉండగా 2009లో రూ.1.43 కోట్లకు, 2014లో రూ.9.88 కోట్లకు, 2019లో రూ.20.93 కోట్లకు పెరిగాయని నివేదిక పేర్కొంది. దావణగెరె బీజేపీ ఎంపీ జీఎం సిద్దేశ్వర ఆస్తులు 2004లో రూ.5.02 కోట్లు ఉండగా 2009 నాటికి రూ. 14.02 కోట్లకు, 2014 నాటికి రూ.23.23 కోట్లకు, 2019 నాటికి రూ 38.01 కోట్లకు పెరిగాయి. హుబ్బళ్లి ధార్వాడ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి 2004లో రూ.77 లక్షల మేరకు ఆస్తి ఉండగా, 2009 నాటికి ఇది రూ.1.44 కోట్లకు, 2014 నాటికి రూ.4.19 కోట్లకు, 2019 నాటికి రూ.11.13 కోట్లకు పెరిగాయి. ఉత్తర కన్నడ బీజేపీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డేకు 2004లో రూ.12.06 లక్షల ఆస్తులు ఉండగా, 2009 నాటికి రూ. 64.27 లక్షలకు, 2014 నాటికి రూ. 3.23 కోట్లకు, 2019 నాటికి రూ. 8.47 కోట్లకు చేరుకున్నాయి. బాగల్కొటె బీజేపీ ఎంపీ పీసీ గద్దిగౌడర్‌ ఆస్తి 2004లో రూ 53.75 లక్షలు కాగా, 2009 నాటికి రూ.1.67 కోట్లకు, 2014 నాటికి రూ.3.63 కోట్లకు, 2019 నాటికి రూ.4.39 కోట్లకు చేరుకుందని ఏడీఆర్‌ నగరంలో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

Updated Date - Feb 24 , 2024 | 02:17 PM