Share News

Congress: మంత్రివర్గంలో మొదలైన లొల్లి.. ఖర్గేను కలిసిన సీఎం

ABN , Publish Date - Feb 18 , 2024 | 08:20 PM

జార్ఖాండ్‌లో హేమంత్ సోరెన్ రాజీనామాతో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన చంపయి సోరెన్ కు కొత్త తలనొప్పి మొదలైంది. కొత్త మంత్రివర్గంలో చోటుదక్కని సుమారు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంపయి సోరెన్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ హుటాహుటిన ఆదివారంనాడు ఢిల్లీకి చేరుకున్నారు.

Congress: మంత్రివర్గంలో మొదలైన లొల్లి.. ఖర్గేను కలిసిన సీఎం

న్యూఢిల్లీ: జార్ఖాండ్‌లో హేమంత్ సోరెన్ (Hemant Soren) రాజీనామాతో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన చంపయి సోరెన్ (Champai Soren)కు కొత్త తలనొప్పి మొదలైంది. కొత్త మంత్రివర్గంలో చోటుదక్కని సుమారు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంపయి సోరెన్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ హుటాహుటిన ఆదివారంనాడు ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)తో సమావేశమయ్యారు.


మర్యాదపూర్వకంగా కలుసుకునేందుకే...

ఖర్గేతో సమావేశానికి ముందు మీడియాతో చంపయి సోరెన్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చానని, ఇది మర్యాదపూర్వక సమావేశమేనని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు, ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని, తాము పరిష్కరించుకుంటామని చెప్పారు. దానిపై చెప్పేదేమీ లేదన్నారు. జేఎంఎం, కాంగ్రెస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అంతా సజావుగానే ఉందని సమాధానమిచ్చారు. కాగా, కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా తాము 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని, తమ అసంతృప్తిపై పీసీసీ అధ్యక్షుడికి లేఖ రాసామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనూప్ సింగ్ చెప్పారు. ఫిబ్రవరి 2న జార్ఖాండ్ కొత్త సీఎంగా చంపయి సోరెన్ ప్రమాణస్వీకారం చేయగా, 5వ తేదీన 47-29 ఓట్ల తేడాతో కూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో గెలిచింది.

Updated Date - Feb 18 , 2024 | 08:30 PM