Share News

Pakistan: రిగ్గింగ్ జరిగిందంటూ పాక్‌లో హోరెత్తుతున్న నిరసనలు.. రంగంలోకి సైన్యం

ABN , Publish Date - Feb 11 , 2024 | 08:11 AM

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్-తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI),ఇతర పార్టీల మద్దతుదారులు సార్వత్రిక ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ దేశవ్యాప్త నిరసనలు చేపట్టారు. పాక్‌లో ఫిబ్రవరి 8న పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. 241 మిలియన్ల జనాభా కలిగిన పాక్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, తీవ్ర వాదం, ఉగ్రవాదంతో పోరాడుతోంది.

Pakistan: రిగ్గింగ్ జరిగిందంటూ పాక్‌లో హోరెత్తుతున్న నిరసనలు.. రంగంలోకి సైన్యం

ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్-తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI),ఇతర పార్టీల మద్దతుదారులు సార్వత్రిక ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ దేశవ్యాప్త నిరసనలు చేపట్టారు. పాక్‌లో ఫిబ్రవరి 8న పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. 241 మిలియన్ల జనాభా కలిగిన పాక్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, తీవ్ర వాదం, ఉగ్రవాదంతో పోరాడుతోంది. కొన్నేళ్లుగా పాకిస్థాన్ ప్రభుత్వాలు స్థిరంగా ఉండట్లేదు. ఫలితాలు వెల్లడైన అనంతరం పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (PML-N) పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని అన్నారు. సంఖ్యా బలం సరిపోకపోవడంతో తాము ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

అయితే ఆయన ప్రత్యర్థి ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించారు. ఆయనా ప్రభుత్వ ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP) తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ బలపరిచిన స్వతంత్రులు 100, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) 73, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) 53, మిగిలిన సీట్లను ఇతర పార్టీలు దక్కించుకున్నాయి. ప్రభుత్వం ఏర్పరచడానికి కావాల్సిన 133 సీట్లు ఏ పక్షానికీ రాలేదు. రాజకీయ పార్టీలు మాత్రం ఎవరికి వారే తామే విజయం సాధించామని, అతి పెద్ద పార్టీగా అవతరించామని చెప్పుకుంటున్నాయి.


నిర్ణయాత్మక శక్తిగా పాక్ సైన్యం!

నిరసనలు జరుగుతున్న సమయంలో నవాజ్ షరీఫ్‌కు అనుకూలంగా సైన్యాధ్యక్షుడు రంగంలోకి దిగడం కొత్త చర్చలకు తావిస్తోంది. షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు అనుగుణంగా సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసీమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రజాస్వామ్య శక్తులన్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి.

వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్‌ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది.

Updated Date - Feb 11 , 2024 | 08:12 AM