Share News

Pakistan: పాకిస్తాన్‌లో రాజకీయ అనిశ్చితి.. సంకీర్ణానికి ఆ రెండు పార్టీలు గ్రీన్ సిగ్నల్!

ABN , Publish Date - Feb 12 , 2024 | 04:03 PM

పాకిస్తాన్‌లో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ని (133) ఏ ఒక్క పార్టీ కూడా అందుకోలేదు. ఈ నేపథ్యంలోనే.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్’ (పీఎంఎల్-ఎన్) పార్టీ పాక్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

Pakistan: పాకిస్తాన్‌లో రాజకీయ అనిశ్చితి.. సంకీర్ణానికి ఆ రెండు పార్టీలు గ్రీన్ సిగ్నల్!

పాకిస్తాన్‌లో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ని (133) ఏ ఒక్క పార్టీ కూడా అందుకోలేదు. ఈ నేపథ్యంలోనే.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్’ (పీఎంఎల్-ఎన్) పార్టీ పాక్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’ (పీపీపీ)తో జరిపిన చర్చల్లో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. పీపీపీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ, అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో తమ పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ సరీఫ్‌ ఆదివారం చర్చలు జరిపారని.. చాలా అంశాలపై ఇరు వర్గాల మధ్య సఖ్యత కుదిరిందని పీఎంఎల్-ఎన్ ప్రకటించింది. అంటే.. సంకీర్ణానికి రెండు పార్టీల మధ్య దాదాపు ఒప్పందం కుదిరినట్లేనని ఆ పార్టీ తెలిపింది.


ఇప్పుడు పాక్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత నుంచి దేశాన్ని కాపాడేందుకు ఇరు పార్టీలు కలవాలని ఈ సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని పీఎంఎల్-ఎన్ పార్టీ స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్‌లో రాజకీయ సహకారం వంటి అంశాలపై ఇరు పార్టీల నేతలు చర్చించినట్లు పేర్కొంది. దేశంలో రాజకీయ స్థిరత్వం కోసం సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు షెహబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో అంగీకరించారని తెలిపింది. త్వరలోనే సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం జరగనుందని.. ఇందులో పీపీపీ నాయకత్వం వారి ప్రతిపాదనలను తమ ముందు ఉంచుతుందని వెల్లడించింది. ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు తమ పక్షానే నిలిచారని ఆ పార్టీ చెప్పుకొచ్చింది. అటు.. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై పీపీపీ అగ్ర నాయకత్వంతో పీఎంఎల్‌-ఎన్‌ నేతలు కలిశారని పీపీపీ సైతం ధ్రువీకరించింది.

ఇదిలావుండగా.. ఫిబ్రవరి 8వ తేదీన 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల ఫలితాలను ఆదివారం పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం విడుదల చేసింది. పాక్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. 133 సీట్లు తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. కానీ.. ఏ ఒక్క పార్టీ కూడా అన్ని సీట్లు సొంతం చేసుకోలేదు. ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (PTI) పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీ చేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు సాధించారు. పీఎంఎల్‌-ఎన్‌కు 75, పీపీపీకి 54 సీట్లు దక్కాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే 129 సీట్లు అవుతాయి. అంటే.. మేజిక్ ఫిగర్‌కి మరో 4 సీట్లు అవసరం. దీంతో.. 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎం-పీతో కూడా నవాజ్‌ షరీఫ్‌ చర్చలు జరుపుతున్నారు. ఈ పార్టీ కలిస్తే.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే.. ఎంక్యూఎం-పీ నుంచి ఇంకా స్పందన రావాల్సి ఉంది.

Updated Date - Feb 12 , 2024 | 04:03 PM