Share News

Islamabad: ఇమ్రాన్ ఖాన్ భార్యనూ వదలని తోషాకానా కేసు.. జైలు శిక్ష ఎన్నేళ్లంటే..

ABN , Publish Date - Jan 31 , 2024 | 01:24 PM

తోషాకానా కేసులో(Toshakhana case) ఇప్పటికే తీర్పు వచ్చి శిక్షకు రెడీ అవుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు(Imran Khan) మరో చిక్కు వచ్చి పడింది. తాజాగా ఈ కేసులో ఆయన భార్య బుస్రా బీబీ( Bushra Bibi)కి కూడా 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ కోర్టు తీర్పునిచ్చింది.

Islamabad: ఇమ్రాన్ ఖాన్ భార్యనూ వదలని తోషాకానా కేసు.. జైలు శిక్ష ఎన్నేళ్లంటే..

ఇస్లామాబాద్‌: తోషాకానా కేసులో(Toshakhana case) ఇప్పటికే తీర్పు వచ్చి శిక్షకు రెడీ అవుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు(Imran Khan) మరో చిక్కు వచ్చి పడింది. తాజాగా ఈ కేసులో ఆయన భార్య బుస్రా బీబీ( Bushra Bibi)కి కూడా 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ కోర్టు తీర్పునిచ్చింది. ఇదే కేసులో ఇమ్రాన్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది.

దంపతులిద్దరికీ జరిమానా విధించింది. బుధవారం బుస్రా.. కోర్టు ముందు హాజరుకావాల్సి ఉండగా.. ఆమె రాలేదు. పాకిస్థాన్ పార్లమెంటు ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనుండగా.. ఈ క్రమంలోనే మాజీ ప్రధానికి శిక్ష విధిస్తూ తీర్పు రావడం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం ఇమ్రాన్‌తో పాటు విదేశాంగ మంత్రి షా మ‌హ‌మ్మ‌ద్ ఖ‌రేషికి మ‌రో కేసులో ప‌దేళ్ల జైలు శిక్ష ప‌డిన విష‌యం విదితమే.


కేసు పూర్వాపరాలివే...

ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో ఇరువురు దంపతులు దేశాధినేతలు, తదితరుల నుంచి 58 ఖరీదైన కానుకలు అందుకున్నారు. వాస్తవానికి వాటిని తోషాఖానాలో జమ చేయాలి. తోషాఖానా అంటే ఖజానా అని అర్థం. ఇది పాకిస్థాన్ ప్రభుత్వ శాఖ కేబినెట్ డివిజన్ పర్యవేక్షణలో ఉంటుంది. రాజకీయ నేతలకు, అధికారులకు వచ్చే బహుమతులను ఇందులో ఉంచుతారు. అయితే బహుమతుల విలువ రూ. 30 వేల కన్నా తక్కువగా ఉంటే, పాకిస్థాన్ అధ్యక్షుడు లేదా ప్రధాని తన వద్ద ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఖరీదు అయితే చట్టం ప్రకారం తోషాఖానాలో ఉంచాలి. ఈ క్రమంలో ఇమ్రాన్ దంపతులు రూ.38 లక్షల రోలెక్స్‌ గడియారాన్ని కేవలం రూ.7.54 లక్షలు చెల్లించి తీసుకున్నారు. రూ.15 లక్షలు విలువ చేసే రోలెక్స్‌ గడియారాన్ని రూ.2.95 లక్షలు మాత్రమే చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇలా మూడోవంతు కంటే తక్కువగా డబ్బు కట్టి , ఆ తర్వాత వాటిని దుబాయిలో అమ్ముకున్నారని పాక్​ మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ ఆరోపించారు.

ఈ వివాదంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ జరిపింది. రూ.2.15 లక్షల విలువైన వస్తువులను తోషాఖానా నుంచి కొనుగోలు చేసినట్లు ఎన్నికల సంఘ విచారణలో ఇమ్రాన్ తెలిపారు. వాటిని విక్రయించగా రూ.5.8 కోట్లు వచ్చినట్లు చెప్పారు. ఈ వివరాల్ని ఐటీ​ రిటర్నుల్లో చూపలేదు. ఫలితంగా ఇమ్రాన్​ ఖాన్​పై ఈసీ అనర్హత వేటు వేసింది. ఈ కేసులో ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్‌ కోర్టు ఆగస్టు 5న ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఆ తర్వాత కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. ఇప్పుడు పాకిస్థాన్ కోర్టు ఏకంగా 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో పాకిస్థాన్ చరిత్రలో సుదీర్ఘ కాలం జైలు శిక్ష పడిన నేతల లిస్టులో ఇమ్రాన్ చేరారు.

Updated Date - Jan 31 , 2024 | 01:25 PM