Share News

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు మరో పెద్ద దెబ్బ.. ఏకంగా రూ.3వేల కోట్లు!

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:30 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే కొన్ని కేసుల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా మరో కేసులో ఊహించని షాక్ తగిలింది. కొన్ని బ్యాంకులను మోసం చేసిన కేసులో అక్షరాల $354.9 మిలియన్‌ (మన ఇండియన్ కరెన్సీలో రూ.3వేల కోట్లకు పైనే) జరిమానా చెల్లించాలని న్యూయార్క్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు మరో పెద్ద దెబ్బ.. ఏకంగా రూ.3వేల కోట్లు!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే కొన్ని కేసుల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా మరో కేసులో ఊహించని షాక్ తగిలింది. కొన్ని బ్యాంకులను మోసం చేసిన కేసులో అక్షరాల $354.9 మిలియన్‌ (మన ఇండియన్ కరెన్సీలో రూ.3వేల కోట్లకు పైనే) జరిమానా చెల్లించాలని న్యూయార్క్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మాన్‌హాటన్‌లో మూడు నెలల పాటు విచారణ జరిపిన అనంతరం జస్టిస్ ఆర్థర్ ఎంగోరాన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఏదైనా న్యూయార్క్ కార్పొరేషన్‌లో అధికారి లేదా డైరెక్టర్‌గా పని చేయకుండా ట్రంప్‌పై నిషేధం విధించారు. అయితే.. ఈ తీర్పుని తాము అప్పీల్ చేస్తామని ట్రంప్ తరఫు న్యాయవాది అలీనా హబ్బా చెప్పారు.


అసలు ట్రంప్ చేసిన మోసం ఏంటి?

తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు గాను డొనాల్డ్ ట్రంప్ తన దగ్గరున్న ఆస్తుల మొత్తాన్ని వాస్తవ విలువ కంటే అత్యధికంగా చూపి.. బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. గత కొన్నేళ్ల నుంచి ఆయన ఈ మోసపూరిత చర్యలకు పాల్పడుతూ.. భారీ మొత్తంలో వ్యాపార రుణాలు, బీమా పొందారని న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌, డెమోక్రాట్‌ నేత లెటిటియా జేమ్స్‌ దావా వేశారు. దీనిపై ఇటీవల రెండున్నర నెలల పాటు న్యాయస్థానం విచారణ చేపట్టగా.. ట్రంప్‌పై వచ్చిన అభియోగాలు నిజమని రుజువైంది. ఈ నేపథ్యంలోనే.. ట్రంప్‌కు $354.9 మిలియన్ జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అయితే.. ఇదొక సివిల్ కేసు కావడంతో జైలు శిక్ష వేయడం లేదని కోర్టు స్పష్టం చేసింది.

కాగా.. ఈ తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా మాధ్యమంగా ఆయన స్పందిస్తూ.. జస్టిస్ ఆర్థర్ ఎంగోరాన్ ఒక నిజాయితీ లేని వ్యక్తి అని, తనపై ఈ దావా వేసిన లెటిటియా జేమ్స్ సైతం అవినీతిపరురాలని ఆరోపణలు గుప్పించారు. కోర్టు ఇచ్చిన ఈ తీర్పు పూర్తిగా బోగస్ అని చెప్పిన ఆయన.. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం కొనసాగిస్తానని చెప్పారు. దీని వెనుక రాజకీయ కోణం ఉందని, తనపై బురద జల్లేందుకే ఈ ప్రయత్నమని పేర్కొన్నారు. మరోవైపు.. తాను చేసిన మోసాలకు గాను ట్రంప్ ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడని జేమ్స్ బదులిచ్చారు. ఎంత పెద్ద ధనవంతులు లేదా శక్తివంతులైనా.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని అన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 03:30 PM