Share News

Israel Vs Iran War: ఇజ్రాయెల్ సైలెంట్ స్కెచ్.. ప్రతిదాడి లేకుండానే ప్రతీకారం!

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:01 AM

తమ దేశంపై క్షిపణి వర్షం కురిపించిన ఇరాన్‌పై ప్రతిదాడి చేయబోమని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌ శాశ్వత ప్రతినిధి గిలాడ్‌ ఎర్డాన్‌ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. ఆదివారం జరిగిన ఇజ్రాయెల్‌ క్యాబినెట్‌ అత్యవసర భేటీలో..

Israel Vs Iran War: ఇజ్రాయెల్ సైలెంట్ స్కెచ్.. ప్రతిదాడి లేకుండానే ప్రతీకారం!
Benjamin Netanyahu

  • ఇరాన్‌కు వ్యతిరేకంగా కూటమి

  • గాజాపై దాడులతో ఇజ్రాయెల్‌పై ఇప్పటికే తీవ్ర ఒత్తిడి అందుకే శాంతి వ్యూహం

Israel Vs Iran War: తమ దేశంపై క్షిపణి వర్షం కురిపించిన ఇరాన్‌పై ప్రతిదాడి చేయబోమని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌ శాశ్వత ప్రతినిధి గిలాడ్‌ ఎర్డాన్‌ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. ఆదివారం జరిగిన ఇజ్రాయెల్‌ క్యాబినెట్‌ అత్యవసర భేటీలో.. ప్రతిదాడికి సింహభాగం మంత్రులు డిమాండ్‌ చేసినా.. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మాత్రం తొందరపాటు ప్రకటనలేమీ చేయలేదు. ప్రస్తుతానికి శాంతిమంత్రం పఠిస్తున్న ఇజ్రాయెల్‌.. దీర్ఘకాలిక వ్యూహంతో ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నాయని విశ్లేషకుల అంచనా.


వారించిన అమెరికా, ఐరోపా దేశాలు..

ఇజ్రాయెల్‌ దాదాపు రెండు దశాబ్దాలుగా ఇరాన్‌లోని అణుస్థావరాలను టార్గెట్‌గా చేసుకుందనే వాదనలున్నాయి. నిజానికి ప్రపంచ మిలటరీ పవర్‌లో ఇరాన్‌ 14, ఇజ్రాయెల్‌ 17 స్థానాల్లో ఉన్నాయి. క్షిపణి రక్షణ కవచాల విషయంలో ఇజ్రాయెల్‌ ముందంజలో ఉందని శనివారం అర్ధరాత్రి ఇరాన్‌ దాడితో తేలింది. ఇజ్రాయెల్‌ ప్రతిదాడికి పాల్పడితే.. పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటాయి. ఇరాన్‌ తరఫున కొన్ని.. ఇజ్రాయెల్‌ తరఫున మరికొన్ని దేశాలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే.. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందనే ఆందోళనలను వ్యక్తమయ్యాయి. దీనికి తోడు.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తీవ్రమయ్యే పరిస్థితులున్నాయి. దీంతో.. ప్రతిదాడి వద్దంటూ అగ్రరాజ్యం అమెరికాతోపాటు.. బ్రిటన్‌, ఇతర ఐరోపా దేశాలు ఇజ్రాయెల్‌కు నచ్చజెప్పడంలో సఫలమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. గాజాపై భూతల దాడులు ప్రారంభించడంతో ఎదురైన మానవతా సంక్షోభం విషయంలో అంతర్జాతీయంగా విమర్శలనెదుర్కొంటున్న నేపథ్యంలో.. ఇప్పుడు కొంచెం వెనక్కి తగ్గడం వల్ల ప్రపంచ దేశాల సంఘీభావాన్ని పొందవచ్చని ఇజ్రాయెల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


పరోక్ష ప్రతీకారం..!

పరోక్ష ప్రతీకారానికి ఇజ్రాయెల్‌ పన్నే వ్యూహాలను గుర్తించడం, ఛేదించడం అంత సులువు కాదు. తమ టార్గెట్‌గా ఉన్నవారు విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు వారిని అంతమొందించడం తెలిసిందే..! ఇప్పుడు తమపై దాడి చేసిన ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌(ఐఆర్‌జీసీ) అగ్రనాయకులను కూడా ఇలాగే టార్గెట్‌గా చేసుకునే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఐఆర్‌జీసీని అమెరికా గతంలోనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. తాజా దాడితో.. ఇప్పుడు ఆ సంస్థను అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ప్రకటించాలనే డిమాండ్‌ను ఐరాసలో ఇజ్రాయెల్‌ శాశ్వత ప్రతినిధి లేవనెత్తారు. భద్రతామండలిలో జరిగే ఓటింగ్‌లో.. తమకు అనుకూలంగా ఓట్లను రాబట్టుకోవడానికి ఇజ్రాయెల్‌ ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు దౌత్యపరంగానూ ఇరాన్‌ను దెబ్బతీసే అవకాశాలు ఇజ్రాయెల్‌ ముందు ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘హమా్‌సపై యుద్ధానికి ముందు వరకు ఇజ్రాయెల్‌తో సౌదీ అరేబియా సన్నిహితంగా మెలిగింది. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య దూరం కొంచెం పెరిగినా.. పాత ఒప్పందాలను మళ్లీ పునరుద్ధరించే అవకాశాలున్నాయి. ఇక బహ్రెయిన్‌, యూఏఈ కూడా ఇజ్రాయెల్‌కు మిత్ర దేశాలుగా ఉన్నాయి. ఇలా అరబ్‌/గల్ఫ్‌ దేశాలతో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ ఓ కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి’’ అని అభిప్రాయపడుతున్నారు. ఇరాన్‌ తాజా దాడిపైనా.. సౌదీ, యూఏఈ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలు ఇజ్రాయెల్‌ను ముందుగానే అప్రమత్తం చేయడం గమనార్హం..! -సెంట్రల్‌ డెస్క్‌

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 10:25 AM