Share News

AP Election 2024: నా కూతురు నా ప్రాపర్టీ కాదు: ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 03 , 2024 | 01:08 PM

‘‘ మా నాన్నని నమ్మొద్దు’’ అంటూ తన కూతురు ముద్రగడ క్రాంతి భారత్ చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. ‘‘నా కూతురి వ్యాఖ్యలకు భయపడను. నా కూతురు నా ప్రాపర్టీ కాదు’’ అని ముద్రగడ పద్మనాభం అన్నారు. తన కూతురికి పెళ్లి అవ్వకముందు తన ప్రాపర్టీ.. పెళ్లి అయ్యాక అత్తగారి ప్రాపర్టీ అని వ్యాఖ్యానించారు.

AP Election 2024: నా కూతురు నా ప్రాపర్టీ కాదు: ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు

కాకినాడ: ఏపీ అసెంబ్లీ న్నికలు-2024 (AP Election 2024) సమీపిస్తుండడంతో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి. మరీ ముఖ్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. కాపు ఓట్లే ప్రధాన లక్ష్యంగా ఇక్కడ రాజకీయం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కూతురు క్రాంతి భారతి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

‘‘ మా నాన్నని నమ్మొద్దు’’ అంటూ తన కూతురు ముద్రగడ క్రాంతి భారత్ చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. ‘‘నా కూతురి వ్యాఖ్యలకు భయపడను. నా కూతురు నా ప్రాపర్టీ కాదు’’ అని ముద్రగడ పద్మనాభం అన్నారు. తన కూతురికి పెళ్లి అవ్వకముందు తన ప్రాపర్టీ.. పెళ్లి అయ్యాక అత్తగారి ప్రాపర్టీ అని వ్యాఖ్యానించారు. ‘‘ నా కూతురు చేత వీడియో రిలీజ్ చేయించారు. ఎవరు బెదిరించినా బెదిరిపోను జగన్‌కి సేవకుడిగా ఉంటాను. నా కూతురికి నాకు మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. బెదిరిపోను. ఇదే పరిస్థితి రేపు పెండెం దొరబాబుకి రావచ్చు’’ అని ముద్రగడ పద్మనాభం అన్నారు.


కాగా తండ్రి పద్మనాభంపై కూతురు క్రాంతి భారతి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ముద్రగడ పద్మనాభం వైఖరిని ఆమె వ్యతిరేకించారు. కేవలం పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ మేరకు ఆమె వీడియోను విడుదల చేశారు.


‘‘పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత విజయం కోసం తన తండ్రి పనిచేయొచ్చు, కష్ట పడొచ్చు తప్పు లేదు. జగన్ మెప్పు కోసం పవన్ కల్యాణ్ మీద మాట్లాడుతున్న భాష మాత్రం సరికాదు. పవన్ కల్యాణ్, ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడటం తగదు. ముద్రగడ తీరు మార్చుకోవాలి. పవన్ కల్యాణ్‌ను తిట్టడం వల్ల ఒరిగేదేమి లేదు. ఎన్నికల సమయంలో ముద్రగడను సీఎం జగన్ వాడుతున్నారు. ఆ తర్వాత ముద్రగడ ఎటు కాకుండా పోవడం ఖాయం. ఈ విషయం ముద్రగడ తెలుసుకుంటే మంచిది. పవన్ కల్యాణ్ గెలుపు కోసం తన వంతుగా కృషి చేస్తా’’ అని క్రాంతి భారతి అన్నారు.

Updated Date - May 03 , 2024 | 01:36 PM