JEE Main 2024: టాయిలెట్ బ్రేక్ తర్వాత కూడా ఆ విద్యార్థులకు బయోమెట్రిక్..నెటిజన్ల కామెంట్స్
ABN , Publish Date - Jan 04 , 2024 | 11:30 AM
ఈ ఏడాది నిర్వహించే JEE మెయిన్ 2024 సెషన్ 1కు హాజరయ్యే విద్యార్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కఠినమైన నిబంధనలను జారీ చేసింది. ఈ క్రమంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు టాయిలెట్ బ్రేక్ తర్వాత కూడా బయోమెట్రిక్(biometric) ఇవ్వాలని తెలిపింది. దీనిపై అనేక మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ అనేది NITలు, IIITల వంటి సాంకేతిక విద్యా సంస్థలలో ప్రవేశానికి నిర్వహించే స్క్రీనింగ్ పరీక్ష. ఈ ఎగ్జామ్ మెరిట్ లిస్ట్లో అర్హత పొందిన మొదటి 20 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITలు) JEE (అడ్వాన్స్డ్)కి హాజరు కావడానికి అర్హులుగా ఉంటారు. అయితే తాజాగా ఈ ఏడాది నిర్వహించే JEE మెయిన్ 2024 సెషన్ 1 ఇంజినీరింగ్ ఎగ్జామ్ నిర్వహణ కోసం విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిలో పరీక్ష సమయంలో విద్యార్థులు వాష్రూమ్కి వెళ్లి వచ్చే క్రమంలో కూడా బయోమెట్రిక్(biometric) ఉపయోగించాలని తెలిపింది. దీంతోపాటు అధికారులు, సూపర్వైజర్లు సహా ఇతర సిబ్బంది కూడా ఇదే విధానాన్ని పాటించాలని పేర్కొంది. ఇది తెలిసిన పలువురు రెండు సార్లు బయోమెట్రిక్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అదేదో విద్యార్థులు పరీక్ష హాలులోకి వెళ్లే సమయంలోనే సమగ్రంగా తనిఖీ చేస్తే సరిపోతుంది కదా అని సూచనలు చేస్తున్నారు.
అయితే విద్యార్థులు లేదా ఇతర సిబ్బంది అక్రమ మార్గాలను నియంత్రించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు NTA డైరెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ తెలిపారు. తాము ఇప్పటికే కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. అయితే పరీక్షను సమర్థవంతంగా పూర్తి స్థాయిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ఇలా చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అభ్యర్థులను ఎంట్రీ గేట్ వద్ద పరీక్షించి బయోమెట్రిక్ హాజరు నమోదు చేయడం జరుగుతుందని, భవిష్యత్తులో జరిగే ఇతర పరీక్షలకు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తామని సింగ్ తెలిపారు.
ఇక JEE మెయిన్ 2024 సెషన్ 1 ఎగ్జామ్ ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ సహా 13 భాషలలో నిర్వహించబడుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. దీని ఫలితాలు ఫిబ్రవరి 12, 2024న విడుదల చేయనున్నారు. JEE మెయిన్ సెషన్ 2 పరీక్ష ఏప్రిల్లో నిర్వహించబడుతుంది.