Hyderabad: నకిలీ వేలిముద్రలతో కార్మికుల జీతాలు కాజేత.. ఇద్దరు కాంట్రాక్టర్ల అరెస్ట్?
ABN , Publish Date - Mar 01 , 2024 | 01:00 PM
కార్మికుల నకిలీ వేలిముద్రలతో జీతాలు కాజేస్తున్న ఇద్దరు కాంట్రాక్టర్లను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్(Central Zone Task Force) పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
హైదరాబాద్ సిటీ: కార్మికుల నకిలీ వేలిముద్రలతో జీతాలు కాజేస్తున్న ఇద్దరు కాంట్రాక్టర్లను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్(Central Zone Task Force) పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలోని వివిధ సర్కిళ్లలో ఎస్ఎఫ్ఏ (కాంట్రాక్టర్)లుగా పనిచేస్తున్న కొందరు కొన్నేళ్లుగా ఈ దందా సాగిస్తున్నారు. వారి పరిధిలో పనిచేస్తున్న కార్మికుల సంఖ్యను తొలుత అధికారికంగా ఎక్కువ చూపిస్తూ, తర్వాత వారిలో సగం మందిని తప్పిస్తున్నారు. క్లోనింగ్ చేసిన (నకిలీ) ఫింగర్ ప్రింట్స్తో జీతభత్యాలు కాజేస్తున్నారు. ఇలా ఒక్కో సర్కిల్లో సుమారు 15 నుంచి 20 మంది పేరుతో కార్మికుల జీతాలు ఏళ్ల తరబడి కాజేస్తున్నారు. తాజాగా ఈ విషయం టాస్క్ఫోర్స్ అధికారుల దృష్టికి రావడంతో ఇద్దరు కాంట్రాక్టర్ల విషయమై తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. గతంలోనూ ఈ తరహా దందా జీహెచ్ఎంసీలో జరిగింది. పలువురు ఎస్ఎ్ఫఏలను అరెస్టు చేశారు.