Constable: తుపాకీతో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN , Publish Date - Apr 12 , 2024 | 08:48 AM
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ ఒకరు గురువారం తుపాకీతో గుండెపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సీతంపేట (విశాఖపట్నం), ఏప్రిల్ 11: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ ఒకరు గురువారం తుపాకీతో గుండెపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, సహ ఉద్యోగులు అందించిన వివరాలు... విజయనగరం జిల్లా వంగర మండలం కొట్టిస గ్రామానికి చెందిన పాలవలస శంకరరావు (35) ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. భార్య శ్రావణి, కుమారుడు కిశోర్, కుమార్తె జ్ఞానవితతో కలిసి మద్దిలపాలెం ప్రాంతంలోని పీతలవానిపాలెంలో నివాసం ఉంటున్నారు. ఉద్యోగంలో అందరితో కలిసిమెలిసి ఉండేవారు. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం ఐదు గంటలకు ద్వారకా నగర్లో గల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు చెస్ట్లో సెంట్రీ డ్యూటీకి హాజరయ్యారు. ఉదయం ఏడు గంటల సమయంలో తన చేతిలో ఉన్న ఎస్ఎల్ఆర్ వెపన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి ఏసీపీ రాంబాబు, ద్వారకా స్టేషన్ సీఐ ఎస్.రమేష్, ఎస్ఐ ధర్మేంద్ర సిబ్బందితో చేరుకుని విచారణ చేపట్టారు. తమ బిడ్డకు ఎటువంటి సమస్యలు లేవని, భార్య శ్రావణి, పిల్లలతో ఎంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నట్టు శంకరరావు తల్లిదండ్రులు చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. శంకరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు.