జగన్పై ఏసీబీ విచారణ చేపట్టాలి: యనమల
ABN , Publish Date - Dec 02 , 2024 | 05:56 AM
విద్యుత్తు ఒప్పందాలు వంటి ఇతర అంశాలను టచ్ చేయకుండా ప్రజా డిమాండ్ మేరకు జగన్ చేసిన రూ.1,750 కోట్ల అవినీతిపై ఏసీబీ విచారణకు ఆదేశించడం సముచితమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.
అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు ఒప్పందాలు వంటి ఇతర అంశాలను టచ్ చేయకుండా ప్రజా డిమాండ్ మేరకు జగన్ చేసిన రూ.1,750 కోట్ల అవినీతిపై ఏసీబీ విచారణకు ఆదేశించడం సముచితమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో ఏసీబీ విచారణ చట్టపరంగా సాధ్యమవుతుందన్నారు. విద్యుత్తు కొనుగోళ్ల కుంభకోణంలో జగన్కు రూ.1,750 కోట్లు ముట్టాయని ఎఫ్బీఐ నివేదిక స్పష్టం చేస్తుంటే.. ఆయన ఈనాడు, ఆంధ్రజ్యోతిలను నిందించడం అర్థరహితమన్నారు. జగన్ పాల్పడిన ఆర్థిక నేరం ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైందన్నారు. ఎఫ్బీఐతో పాటు అంతర్జాతీయ పత్రికలపై ఆయన ఎందుకు దావా వేయలేకపోయారని ప్రశ్నించారు. జగన్ కుంభకోణాన్ని ఒక్క సాక్షి మీడియా తప్ప జాతీయ, అంతర్జాతీయ మీడియాతో పాటు లండన్ ఎకనమిస్ట్ వంటి ఆంగ్ల పత్రికలు కూడా ప్రచురించాయని యనమల తెలిపారు. ప్రపంచం గుర్తించిన అవినీతి నేరాన్ని జగన్ మాత్రమే ఖండిస్తున్నారని యనమల ఎద్దేవా చేశారు.