CID IG Vineet Brijlal : రేషన్ లూటీపై సిట్
ABN , Publish Date - Dec 07 , 2024 | 03:48 AM
రేషన్ బియ్యం మాఫియా గుట్టు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లా ల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది.
సీఐడీ ఐజీ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటు
ఇందులో సీఐడీ ఎస్పీ, నలుగురు డీఎస్పీలు
కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులపై నమోదైన కేసుల విచారణ
స్మగ్లింగ్ సూత్రధారుల గుట్టు తేల్చేందుకు సిట్కు ప్రత్యేక అధికారాలు అప్పగింత
తనిఖీలు, ఆస్తుల జప్తు, అరెస్టుకు వీలు
దర్యాప్తు పురోగతిపై 15 రోజులకో నివేదిక
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రేషన్ బియ్యం కాకినాడకు నలుమూలల నుంచి ఎలా చేరుకుంటున్నాయి? ఎవరు తరలిస్తున్నారు? ఎక్కడినుంచి తరలిస్తున్నారు? ఏయే గోదాములనుంచి మిల్లులకు వెళ్లి పాలిష్ చేసుకుని ఏయే కంపెనీల ద్వారా నౌకల్లో విదేశాలకు తరలిపోతున్నాయి? ఇవి కేవలం ప్రశ్నలు కాదు.. సర్కారుకు పెను సవాళ్లు! ఈ సవాళ్లకు ‘సిట్’ సమాధానం ఇవ్వనుంది!
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): రేషన్ బియ్యం మాఫియా గుట్టు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లా ల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది. కాకినాడ పోర్టు కేం ద్రంగా జరిగిన ఎగుమతులపై నమోదైన 13 కేసుల్లో నిందితులు, సూత్రధారులు ఎవరో తేల్చాలని ఆదేశించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాల ని సూచించింది. సిట్లో సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్వర్ధన్రెడ్డి, బాలసుందరరావు, గోవిందరావు, రత్తయ్యలను నియమించారు. శుక్రవారం సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
మిల్లర్లు, ఎగుమతిదారులు, నాయకులతో వ్యవస్థీకృత నేరంగా తయారైన ఈ చైన్ లింకు నెట్వర్క్ ను పూర్తిగా తెగ్గొట్టాలని ఆదేశాలు జారీ చేశా రు. లక్షలాది రేషన్ కార్డుల బియ్యం పక్కదారి పట్టిన వ్యవహారాన్ని సీరియ్సగా తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. ‘సిట్’కు ప్రత్యేక అధికారాలు కల్పించింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 కింద కేసులు విచారిం చి, గోదాములు, అనుమానం ఉన్న చోట్ల తనిఖీలు చేసేందుకు అనుమతిచ్చింది. అలాగే అక్రమ ఎగుమతిదారుల ఆస్తులను జప్తు చేసి, బాధ్యులను అరెస్టు చేయడానికి పూర్తి అధికారాలు ఇచ్చింది. రేషన్ బియ్యానికి పాలిష్ పెట్టి ఎగుమతులు చేస్తున్న వారిని ఉపేక్షించొద్దని స్పష్టం చేసింది.
వేలకోట్లు దోపిడీ
గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని పెద్దఎత్తున విదేశాలకు అక్రమ రవాణా చేసి వేలకోట్లు సొమ్ము చేసుకున్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి నౌకను సీజ్ చేయాలని ఆదేశించడంతో రేషన్ మాఫియా అంశం చర్చనీయాంశమైంది. విజిలెన్స్ సమాచారం తెప్పించుకున్న సీఎం ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షించారు. సీఐడీ విచారణ కు ఆదేశించాలని భావించినా, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తే తొందరగా కొలిక్కి వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. సమర్థుడైన అధికారిగా పేరున్న ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు.
కాగా, బియ్యం అక్రమ ఎగుమతులపై నిగ్గు తేల్చాలంటే సీఐడీ, పోలీసులతో పాటు సివిల్ సప్లయ్, రెవెన్యూ అధికారులు కూడా సిట్ బృందంలో ఉంటే బాగుండేదన్న అభిప్రాయా లు వినిపిస్తున్నాయి. అలాగే సిట్లో డీఎస్పీ అశోక్వర్ధన్ రెడ్డి పేరు చేర్చడంపై భిన్నాభిప్రా యం వ్యక్తమవుతోంది. ఒంగోలు, దర్శి డీఎస్పీ గా పనిచేసిన సమయంలో ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. వైవీ సుబ్బారెడ్డి అండతో ఒంగోలు డీఎస్పీగా ఆయన పోస్టింగ్ దక్కించుకున్నారని అప్పట్లో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి అభ్యంతరం చెప్పడంతో వివాదం రేగింది. అశోక్వర్ధన్ రెడ్డికి దర్శి డీఎస్పీగా సుబ్బారెడ్డి పోస్టింగ్ ఇప్పించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు బియ్యం అక్రమ ఎగుమతుల వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్లో అశోక్వర్ధన్ రెడ్డి ఉండడంపై అభ్యంతరాలు వస్తున్నాయి.