Share News

AP Assembly: పోలీసుల దుశ్చర్య.. సర్పంచ్‌లను బూటు కాళ్లతో తన్నుతూ ఈడ్చుకెళ్లిన ఖాకీలు

ABN , Publish Date - Feb 06 , 2024 | 09:30 AM

Andhrapradesh: సర్పంచ్‌ల నిరసన అసెంబ్లీని తాకింది. సర్పంచ్‌ల నిరసనలతో అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం ఉదయం అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్‌లు యత్నించారు. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచ్‌లు దూసుకొచ్చారు.

AP Assembly: పోలీసుల దుశ్చర్య.. సర్పంచ్‌లను బూటు కాళ్లతో తన్నుతూ ఈడ్చుకెళ్లిన ఖాకీలు

అమరావతి, ఫిబ్రవరి 6: సర్పంచ్‌ల నిరసన అసెంబ్లీని తాకింది. సర్పంచ్‌ల నిరసనలతో అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంగళవారం ఉదయం అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్‌లు యత్నించారు. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచ్‌లు దూసుకొచ్చారు. కొందరు సర్పంచ్‌లను వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు తమ కార్లలో తీసుకొచ్చి అసెంబ్లీ బయట విడిచిపెట్టారు. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేల కార్లు తనిఖీ చేయకపోవడంతో అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచ్‌లు రాగలిగినట్లు తెలుస్తోంది. మరికొందరు సర్పంచ్‌ల తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్లలో వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీకి వెళ్లే మార్గం వద్ద సర్పంచ్‌లను పోలీసులు అడ్డుకున్నారు.

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచ్‌ల నినాదాలు చేశారు. నిరసనకు వచ్చిన సర్పంచ్‌లను పోలీసులు నిర్దాక్షణ్యంగా ఈడ్చిపాడేశారు. సర్పంచ్‌లను బూటు కాళ్లతో తన్నుతూ లాఠీలతో కొడుతూ ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. పోలీసుల కాళ్ళపైన పడి మరీ తమ హక్కులను కాపాడాలని సర్పంచ్‌లు వేడుకున్నప్పటికీ పోలీసులు కనికరించని పరిస్థితి. పోలీసుల చర్యలతో సర్పంచ్‌ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. పలువురు సర్పంచ్‌లకు కూడా గాయాలయ్యాయి. మహిళా సర్పంచ్‌ల పట్ల కూడా పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. సర్పంచ్‌లను బలవంతంగా అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 06 , 2024 | 04:42 PM