Share News

Purandeswari: కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:30 PM

రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరిదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా ఇవాళ, రేపు సమావేశాలు ఉంటాయన్నారు.

Purandeswari: కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది

విజయవాడ: రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరిదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా ఇవాళ, రేపు సమావేశాలు ఉంటాయన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ జెండా రెపరెపలాడుతోందన్నారు. కొన్ని చోట్ల అధికారం పంచుకుంటుందన్నారు. ఏపీకి చేసిన మేలు ప్రజలకు వివరించే‌ బాధ్యత‌ పదాధికారులదేనన్నారు. వికసిత్ భారత్ ద్వారా కేంద్ర పథకాలను వివరిస్తున్నామని పురందేశ్వరి అన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటున్నారన్నారు.

వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా ఇవి కేంద్ర పథకాలను ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. పదేళ్లలో ప్రజలకు ఏం చేసేమో మనమే చెప్పాలన్నారు. రాష్ట్ర పరిస్ధితులను మనం బేరీజు చేసుకోవాలన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని పురందేశ్వరి అన్నారు. ప్రస్తుత వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులను 12 లక్షల కోట్లకు పైగా తీసుకెళ్లి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ‌మార్చేసిందన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ప్రతి పథకం వెనకాల ఒక స్కాం ఉందన్నారు. డబ్బులు వేస్తూనే ప్రతి పథకంలో తమ వాటా ఉండే విధంగా అవినీతికి పాల్పడుతున్నారని పురందేశ్వరి పేర్కొన్నారు.

‘‘రైతాంగం నైరాశ్యంలో కూరుకుపోయింది. మొన్న తుపాను దాటికి రైతాంగం అనేక ఇబ్బందులు పడ్డారు. రైతు పార్టీ అని చెప్పుకునే వైసీపీ రైతాంగానికి ఏం చేసిందో చెప్పాలి. విశాఖలో మహిళపై పాశవికంగా అత్యాచారం చేయడం దుర్మార్గం. దిశ యాప్ ఉందని సీఎం జగన్ గొప్పగా చెప్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు రాలేదు. ఐదు లక్షల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చిన జగన్ మాట ఏమైంది? ఎస్సీ నియోజకవర్గాల్లోనూ పెద్దిరెడ్డి లాంటి వాళ్లు పెత్తనం చెలాయిస్తున్నారు. రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా అవకాశ మిచ్చారని వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - Jan 03 , 2024 | 01:30 PM