Share News

Amaravathi: పొత్తులపై ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు, పవన్.. ఏమన్నారంటే

ABN , Publish Date - Mar 09 , 2024 | 09:07 PM

రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు పార్టీల పొత్తు నిర్ణయం అనంతరం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

Amaravathi: పొత్తులపై ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు, పవన్.. ఏమన్నారంటే

అమరావతి: రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు పార్టీల పొత్తు నిర్ణయం అనంతరం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

"ఉమ్మడి ఏపీ విభజనతో ఒక దశాబ్దం పాటు సామాజిక, ఆర్థిక రాజకీయ గందరగోళం ఏర్పడింది. 5 ఏళ్లుగా వైసీపీ అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని దోచుకుంది. బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు సాధారణమైపోయాయి. న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. 30 వేలకుపైగా మహిళలు తప్పిపోయారు. దళితులపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రతిపక్ష ఓటు చీలితే సీఎం జగన్‌కు లాభం జరుగుతుంది. ఓటు చీలకూడదనే.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో మూడు పార్టీలు కలిసి పని చేస్తాయి. ఎన్డీఏలో మమ్మల్ని భాగస్వామ్యం చేసుకున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కూడా ధన్యవాదాలు" అని పవన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.


రాష్ట్రాభివృద్ధి కోసమే..

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుపై ఆయన ఎక్స్‌లో స్పందించారు. "టీడీపీ రాష్ట్ర అభివృద్ధికి కృత నిశ్చయంతో ఉంది. ఏపీ ప్రజలు ఈ కూటమిని ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది.

NDAలో తిరిగి చేరడం చాలా సంతోషానిస్తోంది. మూడు పార్టీలది పొత్తు మాత్రమే కాదు. రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడే భాగస్వామ్య కూటమి. ప్రజలు చారిత్రక తీర్పుతో కూటమికి అధికారాన్ని అందిస్తారు. ప్రధాని మోదీ సహకారంతో ఏపీలో సైతం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం" అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Updated Date - Mar 09 , 2024 | 09:17 PM