Share News

Adani: మన్యంలో స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ అదానీ చేతికి!

ABN , Publish Date - Apr 12 , 2024 | 08:25 AM

‘అదానీ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం గిరిజన చట్టాలను సైతం తుంగులో తొక్కుతోంది. మన్యంలో జలాశయాల నుంచి నీటిని ఎత్తిపోస్తూ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నిల్వచేసే ప్రాజెక్టులను చట్ట విరుద్ధంగా అదానీ (Adani) పవర్‌ సంస్థలకు కట్టబెట్టింది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలను రూపొందించి అనేక రాయితీలతో ఆయా విద్యుత్‌ సంస్థలకు ప్రాజెక్టులు కట్టబెడుతున్నాయి.

Adani: మన్యంలో స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ అదానీ చేతికి!

● మన్యంలో స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు అదానీకి

● 2 వేల ఎకరాలకు పైగా భూములు కట్టబెట్టే ఏర్పాట్లు

● గిరిజనేతరులకు ఇవ్వకూడదని స్పష్టంగా నిబంధనలు

● అయినా అదానీతోపాటు మరో సంస్థకు కేటాయింపు

● 2 వేల ఎకరాలకు పైగా భూములు కట్టబెట్టే ఏర్పాట్లు

రంపచోడవరం, ఏప్రిల్‌ 11: ‘అదానీ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం గిరిజన చట్టాలను సైతం తుంగులో తొక్కుతోంది. మన్యంలో జలాశయాల నుంచి నీటిని ఎత్తిపోస్తూ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నిల్వచేసే ప్రాజెక్టులను చట్ట విరుద్ధంగా అదానీ (Adani) పవర్‌ సంస్థలకు కట్టబెట్టింది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలను రూపొందించి అనేక రాయితీలతో ఆయా విద్యుత్‌ సంస్థలకు ప్రాజెక్టులు కట్టబెడుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోనూ జగన్‌ సర్కారు 2022లో ప్రత్యేక విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం 14,680 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, నిల్వ చేసేందుకు గానూ 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రాజెక్టులను వివిధ సంస్థలకు కేటాయించింది. వీటిలో నాలుగు ప్రాజెక్టులు అల్లూరి, పార్వతీపురం మన్యం గిరిజన జిల్లాల్లో ఉన్నాయి. అయితే గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్టులను చట్ట విరుద్ధంగా గిరిజనేతర సంస్థలకు కట్టబెట్టడం వివాదాస్పదంగా మారింది.

అల్లూరి జిల్లాలోని కొయ్యూరు మండలం ఎర్రవరంలో 1200 మెగావాట్లతో, అనంతగిరి మండలం పెదకోటలో 1000 మెగావాట్లతో, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కురుకుట్టిలో 1200 మెగావాట్లతో, కర్రివలసలో 1000 మెగావాట్లతో ఈ పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను మంజూరు చేసింది. వీటిలో పెదకోట మినహా తక్కిన మూడు ప్రాజెక్టులను అదానీ పవర్‌ కంపెనీకి కట్టబెట్టింది. పెదకోట ప్రాజెక్టును షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెట్టారు. ఈ ప్రాజెక్టుల కోసం మొత్తంగా 2వేల ఎకరాలకుపైగా భూమి కావాలి. వీటిలో 25 శాతం వరకూ అటవీ భూములు ఉండగా, తక్కినవి పట్టా భూములు, ప్రభుత్వ భూములు. భూ సేకరణ ద్వారా ఈ భూములను చేపట్టేందుకు చట్టం ఉన్నా, వాటిని గిరిజనేతర సంస్థలకు కట్టబెట్టేందుకు మాత్రం చట్టాలు అనుమతించడం లేదు.

అంతేకాకుండా ఈ ప్రాజెక్టుల మూలంగా నిరాశ్రయులయ్యే గిరిజనులు, గిరిజన గూడేలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీటిపై ఇప్పటికే ఆయా ప్రాంతాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టనట్టే వ్యవహరిస్తోంది. గిరిజన చట్టాల ప్రకారం గిరిజనులకు, గిరిజనులు సభ్యులుగా ఉన్న సంఘాలకు తప్ప ఇతరులకు గిరిజన ప్రాంతాల్లో ఏ రూపంలోనూ భూములను బదలాయించేందుకు అవకాశం లేదు. కానీ, జగన్‌ ప్రభుత్వం మాత్రం ఈ చట్టాలను తుంగలో తొక్కుతూ అదానీ పవర్‌కు మూడు ప్రాజెక్టులు, షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌కు ఒక ప్రాజెక్టును కట్టబెట్టింది.

సుప్రీం కోర్టు చెప్పినా...

బాక్సైట్‌ తవ్వకాల విషయంలోనూ ఇలాంటి వ్యవహారమే చోటు చేసుకుంటే అది వివాదాస్పదంగా మారి సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. సమతా కేసుగా ప్రాచుర్యం పొందిన సదరు కేసులో గిరిజన ప్రాంతాలలో స్థిరాస్థులను గిరిజనేతరులెవ్వరికీ కట్టబెట్టే వీలు లేదని, ప్రభుత్వాన్ని కూడా గిరిజనేతరునిగానే పరిగణిస్తారని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలిసినా గిరిజన హక్కులను, చట్టాలను హరించేసి పవర్‌ ప్రాజెక్టులను ఆయా గిరిజనేతర సంస్థలకు కట్టబెట్టారు. దీనిపై న్యాయపోరాటానికి పలు సంస్థలు సిద్ధమవుతున్నాయి.

Updated Date - Apr 12 , 2024 | 08:25 AM