Share News

జాగో..వైజాగ్

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:15 AM

రుషికొండలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హెల్త్‌స్పా... ‘బే పార్క్‌’! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే లీజుకు తీసుకున్న 37 ఎకరాల్లో ఇండో అమెరికన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. అది 33 ఏళ్ల లీజు ఒప్పందం. 1998లో భూమిని ఇవ్వగా, కష్టపడి కేంద్రం నుంచి అనుమతులు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకువచ్చి నిర్మాణాలు చేపట్టి...11 ఏళ్ల కిందట సేవలు ప్రారంభించింది. ‘బే పార్క్‌’ 28 ఎకరాలు కొండపై ఉండగా, దానికి ఎదురుగా తీరాన్ని ఆనుకొని మరో 9 ఎకరాలు ఉంది.

జాగో..వైజాగ్

ఒక్క చాన్స్‌’ రాగానే విశాఖపై వైసీపీ పంజా

పెద్దల కన్ను పడితే వాటాలు ఇవ్వాల్సిందే

వందల కోట్ల విలువైన ప్రాజెక్టులు హస్తగతం

ప్రవాసాంధ్రుడికి బెదిరింపులతో దందాలు షురూ

వచ్చీ రాగానే విపక్ష నేతల ఆస్తులపై దాడులు

బెదిరింపులకు లొంగని వారికి వేధింపులు

జగన్‌ కుటుంబం మనసు పడగానే ‘బే పార్క్‌’ గాయబ్‌

బెదిరించి, తాళాలు వేయించి ‘కార్తీకవనం’లో వాటాలు

వేలకోట్ల విలువైన దసపల్లా భూములతో జల్సా

ఉచిత సభ్యత్వం ఇవ్వలేదని వాల్తేరు క్లబ్బుపై పగ

రామానాయుడు స్టూడియో భూములతో వ్యాపారం

విశాఖలో సామాన్యుల ఆస్తులకూ భద్రతలేక భయం

బే పార్కు... బినామీల హస్తగతం

రుషికొండలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హెల్త్‌స్పా... ‘బే పార్క్‌’! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే లీజుకు తీసుకున్న 37 ఎకరాల్లో ఇండో అమెరికన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. అది 33 ఏళ్ల లీజు ఒప్పందం. 1998లో భూమిని ఇవ్వగా, కష్టపడి కేంద్రం నుంచి అనుమతులు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకువచ్చి నిర్మాణాలు చేపట్టి...11 ఏళ్ల కిందట సేవలు ప్రారంభించింది. ‘బే పార్క్‌’ 28 ఎకరాలు కొండపై ఉండగా, దానికి ఎదురుగా తీరాన్ని ఆనుకొని మరో 9 ఎకరాలు ఉంది. దీనిపైనా వైసీపీ పెద్దల కన్ను పడింది. ‘మూడు ముక్కలాట’ మొదలుపెట్టిన అనంతరం... జగన్‌ కుటుంబ సభ్యులు విశాఖలో బే పార్క్‌ను చూసి ముచ్చటపడి, ‘ఇక్కడే మన కాపురం’ అని డిసైడ్‌ అయ్యారట! అంతే మొత్తం సీన్‌ మారిపోయింది. బే పార్క్‌ నిర్వాహకులకు బ్యాంకుల్లో కొంత రుణం ఉంది. ‘ఆ బ్యాంకు రుణం మేం మేం చూసుకుంటాం. భూమి ఎలాగూ ప్రభుత్వానిదే! ఇన్నాళ్లూ మీరు చేసిన కష్టానికి ఓ పది శాతం వాటా ఇస్తాం’ అంటూ బే పార్కును లాగేసుకున్నారు. ఆ సంస్థ లీజు గడువులో 25 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకో ఎనిమిదేళ్లు మాత్రమే ఉంది. ఈ మిగులు కాలంలో దానిపై వెచ్చించిన మొత్తం తిరిగి వచ్చే పరిస్థితి కనిపించలేదు. దాంతో లీజు కాలం పొడిగించాలని నిర్ణయించారు. అధికారం చేతిలో ఉండడంతో అనుకున్నదే తడవుగా లీజును 99 ఏళ్లకు పెంచేశారు.

సుందరతీరం... చక్కటి నగరం! విశాఖపట్నం అంటే ఇష్టంలేని వాళ్లు ఎవరుంటారు? మనకే కాదు... వైసీపీ నేతలకూ విశాఖ అంటే ఇష్టమే! కానీ... ఆ ఇష్టం విశాఖనగరంలోని ఆస్తుల మీద! చుట్టూ విస్తరించిన వనరుల మీద! విశాఖపై ఎప్పటి నుంచో కన్నేసి... ఓ ‘స్కెచ్‌’ గీసిపెట్టుకున్న వైసీపీ పెద్దలు, అధికారంలోకి రాగానే దానిని అమలు చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగా పెట్టుబడిదారులనూ వేధించి, వారు ఇక్కడి నుంచి పారిపోయేలా చేశారు. కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో వాటాలు కొట్టేశారు. విపక్ష నేతల ప్రహరీలు కూల్చేయడం మొదలుకుని... రుషికొండకు గుండు కొట్టడం దాకా అంతా ఒక ‘పద్ధతి’ ప్రకారం జరిగింది! ఈ ఐదేళ్లలో విశాఖలో వైసీపీ గ్యాంగ్‌ చేసిన దందాలు, దోపిడీలు... మచ్చుకు కొన్ని!

క్లబ్బుపై గబ్బు

విశాఖపట్నంలో వాల్తేరు క్లబ్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. అనేక మంది ప్రముఖులు ఇందులో సభ్యులు! కొత్తగా సభ్యత్వం కావాలంటే... రూ.50 లక్షలు కట్టాలి. కానీ... కొందరు ‘పెద్దలు’ తమకు ఫ్రీగా క్లబ్బు మెంబర్‌షిప్‌ కావాలని డిమాండ్‌ చేశారు. నిర్వాహకులు అందుకు అంగీకరించలేదు.

క్లబ్బు నిబంధనలు ఒప్పుకోవని చెప్పారు. అంతే... వైసీపీ పెద్దల్లో గబ్బు ఆలోచనలు మొదలయ్యాయి.

అందులో ప్రభుత్వ భూమి ఉందని, క్లబ్బును స్వాధీనం చేసుకొంటామని బెదిరించారు. కొలతలు వేశారు. రికార్డులు విజయవాడ తీసుకువెళ్లారు. క్లబ్బు ప్రతినిధులు దీనిపై కోర్టును ఆశ్రయించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి పది రోజుల క్రితం వాల్తేరు క్లబ్బు గురించి ప్రస్తావించారు. ‘‘వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వాల్తేరు క్లబ్‌లో ప్రభుత్వ భూమి తీసుకుంటాం’’ అని ఆయన చెప్పడం గమనార్హం.

‘సినిమా’ చూపించారు..

విశాఖపట్నానికి సినీ పరిశ్రమ విస్తరించాలని ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు భీమిలి బీచ్‌రోడ్డులో కొండపై 34.44 ఎకరాలను రామానాయుడుకు చెందిన సురేశ్‌ ప్రొడక్షన్స్‌కు కేటాయించారు. ఆ భూమిని కేవలం సినిమా షూటింగ్‌లు, స్టూడియో నిర్మాణాలకు మాత్రమే వినియోగించాలి.

అందులో కొంత భూమి మాత్రమే ఉపయోగించుకొని భవిష్యత్తులో విస్తరించాలని మరికొంత ఖాళీగా ఉంచారు. దానిపై వైసీపీ పెద్దల కన్ను పడింది. ‘వాటా ఇస్తారా? ఖాళీ భూమిని వెనక్కి తీసేసుకొమ్మంటారా?’ అని బెదిరించారు. ఖాళీ స్థలంలో లేఅవుట్‌ వేసి కొన్ని ప్లాట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు.

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్‌ ఒకరు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోతూ అడ్డగోలుగా ఈ లేఅవుట్‌కు అనుమతి ఇస్తూ సంతకం చేసేశారు. 15.18 ఎకరాల్లో లేఅవుట్‌... అందులో రెండొంతులు వైసీపీ పెద్దలకు! ఇదీ తెరవెనుక ఒప్పందం! దీనిపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణబాబు కోర్టుకు వెళ్లడంతో... ప్లాట్ల విక్రయాలు ఆగిపోయాయి.

భూముల కోసం భయపెట్టి...

ఏపీలో ఐటీ అంటే విశాఖే. ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీగా పేరుంది. చంద్రబాబు కృషి వల్ల పేటీఎం, ఐబీఎం, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ఎడెక్కొ (రిక్రూటింగ్‌ కంపెనీ), కార్డిలిటిక్స్‌ (అమెరికా కంపెనీ), హెచ్‌ఎ్‌సబీసీ వంటి ప్రముఖ సంస్థలు ఏర్పాటయ్యాయి.

వైసీపీ అధికారంలోకొచ్చాక కంపెనీల్లో వాటాలు కోరడం మొదలైంది. భూములు వెనక్కి తీసుకుంటామని బెదిరించారు. దీంతో ఐబీఎం, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సహా పైన పేర్కొన్న కంపెనీలన్నీ విశాఖ నుంచి వెళ్లిపోయాయి.

ఇంకో 50 చిన్న కంపెనీలు మూతపడ్డాయి. అంతర్జాతీయంగా పేరుపొందిన లులూ సంస్థ బీచ్‌రోడ్డులో 13 ఎకరాల విస్తీర్ణంలో భారీ షాపింగ్‌మాల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి టీడీపీ హయాంలో ఒప్పందం జరిగింది. వైసీపీ వచ్చాక పర్సంటేజీలు డిమాండ్‌ చేయడంతో.. లులూ హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. ఆ భూమిని అతి తక్కువగా రూ.1450 కోట్లకు అస్మదీయులకు అమ్మి సొమ్ము చేసుకోవాలని వైసీపీ పెద్దలు ప్రయత్నించారు. కానీ... పలువురు కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారు.


కార్తీకవనమూ... కైవసం

విశాఖపట్నంలో చేతులు మారిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘కార్తీకవనం’ ఒకటి. ఇప్పుడు అందులో రాడీసన్‌ బ్లూ పేరుతో 5 స్టార్‌ హోటల్‌ నడుస్తోంది. విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఓ ప్రైవేటు సంస్థతో 20 ఏళ్ల క్రితం చేసుకున్న బీఓటీ ప్రాజెక్టు ఇది. విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో సాగర్‌నగర్‌ దగ్గర బీచ్‌ను ఆనుకొని పది ఎకరాల స్థలాన్ని 33 ఏళ్ల లీజుకు ఇచ్చారు.

ఆ ప్రాజెక్టు పూర్తవుతున్న దశలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దానిపై అధికార పార్టీ పెద్దల కన్ను పడింది. అంతే... ఆ ప్రాజెక్టు ప్రాంగణానికి ఒక పోలీస్‌ అధికారి తాళాలు వేయించారు. పెద్దలతో మాట్లాడుకోవాలని పరోక్షంగా సందేశాలు ఇచ్చారు. ప్రాజెక్టు భాగస్వాములకు విషయం అర్థమైంది. విశాఖలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న ఓ నేతను కలిశారు. అందులో 50 శాతం వాటా సమర్పించుకున్నారు. ఆ తర్వాత... పనుల పూర్తికి సహకరించడంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ అక్కడే నిర్వహిస్తూ వ్యాపారాభివృద్ధికి కూడా తోడ్పాటు అందిస్తున్నారు.

దసపల్లా భూములు హస్తగతం

విశాఖలో దసపల్లా భూముల వివాదం కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది. నగరం నడిబొడ్డున ఉన్న ఆ భూముల విలువ రూ.3 వేల కోట్లు. వాటిని 15 ఏళ్ల కిందటే నిషేధిత (22-ఏ) జాబితాలో చేర్చారు. వైసీపీ అధికారంలోకి రాగానే విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. అయితే... సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పును అడ్డం పెట్టుకొని ఆ భూములను ప్రభుత్వ జాబితా నుంచి తప్పించి, 65 మందికి దఖలు పడేలా చేశారు. ఆ తర్వాత వారందరినీ బెదిరించి... 75,600 చ.గ. స్థలాన్ని డెవల్‌పమెంట్‌ పేరుతో తీసుకొని, తమ బినామీలతో ఏర్పాటుచేసిన కంపెనీతో ఒప్పందం చేయించారు. ఆ 65 మందికి నామమాత్రపు వాటా ఇచ్చి, అత్యధిక వాటా సాయిరెడ్డి అండ్‌ కో తీసుకున్నారు. అధికారులను బెదిరించి తక్కువ ఫీజుతో డెవల్‌పమెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.


రాజధాని పేరుతో విశాఖకు వంచన

‘వైసీపీతో ఇలాగే ఉంటుంది’ అని జగన్‌ ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకే విశాఖ వాసులకు తెలిపిన ఉదంతమిది! ‘ఇక మన భూములు, స్థలాలు భద్రం కాదు’ అని అందరూ జాగ్రత్తపడాల్సి వచ్చింది. అంతేకాదు.. ఈ దందాల వెనుక నేరుగా సర్కారు పెద్దలు ఉన్నారని కూడా అర్థమైపోయింది. ఆ సంఘటన ఏమిటంటే... విశాఖలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఐదెకరాల భూమిని ప్రవాసాంధ్రుడైన లలితేశ్‌ 19 ఏళ్ల క్రితం కొనుగోలు చేశారు. అది అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ భూమి.

వైఎస్‌ హయాంలో రూ.10 కోట్ల రుసుము చెల్లించి మరీ క్రమబద్ధీకరించుకున్నారు. కాలక్రమంలో ఆ భూమి ధర పెరుగుతూ వచ్చింది. వైసీపీ అధికారంలోకి రాగానే.. కొందరు సీమ నేతలు విశాఖలో దిగారు. లలితేశ్‌ భూమిపై కన్నేశారు. ‘‘ఈ భూమి రూ.100 కోట్ల విలువ చేస్తుంది. లిటిగేషన్‌ ఉందని భయపెడితే డబ్బులొస్తాయి’’ అని ప్లాన్‌ వేశారు. పులివెందుల బ్యాచ్‌ లలితేశ్‌ బావమరిది నరేశ్‌కుమార్‌ ఇంటికి వెళ్లారు. ‘‘మాకు కొంత వాటా ఇవ్వాల్సిందే. లేదంటే... వివాదాస్పదమంటూ మొత్తం భూమి లాగేసుకుంటాం’’ అని తుపాకీ చూపించి బెదిరించారు. పులివెందుల రౌడీలు బెదిరించిన కొన్ని రోజులకే... ఆ భూమిని స్వాధీనం చేసుకుంటూ అమరావతి నుంచి జీవో జారీ అయ్యింది. దీనిపై లలితేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అనుకూలంగా తీర్పు వచ్చింది. వెంటనే లలితేశ్‌ బంధువులు ఆ భూమిలో నర్సరీ, బేకరీ ఏర్పాటు చేసుకున్నారు. అయినా... ఇప్పటికీ వైసీపీ నేతలు వారిని వదలడం లేదు. ఏదో ఒక గొడవ సృష్టించి, అధికారులను అక్కడికి పంపి నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుపడుతున్నారు.


కోడికత్తి కేసులో కక్ష.. వ్యాపారం బంద్‌

విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీను పని చేస్తున్న రెస్టారెంట్‌ టీడీపీ సానుభూతిపరుడైన హర్షవర్ధన్‌ది. వైసీపీ రాగానే ఆయనపై కక్షగట్టారు. సిరిపురంలో వీఎంఆర్‌డీ నుంచి లీజుకు తీసుకున్న స్థలంలో నిర్వహిస్తున్న ‘ఫ్యూజన్‌ ఫుడ్స్‌’ను రాత్రికి రాత్రి ఖాళీ చేయించారు. 50 మంది సిబ్బందితో, ఓ 25 మంది పోలీసులతో సామగ్రిని వాళ్లే పది లారీల్లోకి ఎక్కించేశారు. ఆ తరువాత గేటుకు నోటీసు అంటించారు. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఏడాది తిరగకుండానే దానిని వెనక్కి ఇవ్వాలని తీర్పు వచ్చింది.

విల్లాలతో విలాసం..

అనకాపల్లి జిల్లాలో వైపీపీ పెద్దలు ఏకంగా 403 ఎకరాల్లో అత్యంత రహస్యంగా ‘భూయజ్ఞం’ చేశారు. అడవులు, కొండలు, గోర్జీలు కలిపేసుకున్నారు. చివరికి ‘వింటేజ్‌ మౌంట్‌ వ్యాలీ రిసార్ట్‌’ పేరుతో విల్లాల వ్యాపారం మొదలుపెట్టారు. ప్రారంభ ఆఫర్‌గా 500 గజాల ప్లాటు రూ.25 లక్షలకే ఇస్తున్నామని చెప్పి అమ్మేసుకుంటున్నారు. ఈ దందాను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్‌ విచారణ జరిపి ఇచ్చిన నివేదిక బుట్టదాఖలైపోయింది. ఈ మొత్తం కథ నడిపిస్తున్నది వైసీపీ పెద్దలే!

కక్ష సాధింపే...

పల్లా శ్రీనివాస్‌ భవనం కూల్చివేత

గాజువాక మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావును వైసీపీలోకి రావాలని ఎంపీ విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారు. దీనిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అంతే... పల్లాపై పగ మొదలైంది. ఆయన గాజువాకలో అన్ని అనుమతులతో నిర్మించుకుంటున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో నిబంధనల ఉల్లంఘన ఉందంటూ 2021 ఏప్రిల్‌ 25న కొంత భాగం కూలగొట్టించారు. భవనానికి మూడు శ్లాబులు వేసిన తరువాత ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఓ ఆదివారం తెల్లవారుజామున 200 మంది పోలీసులు, జీవీఎంసీ సిబ్బంది జేసీబీలతో వచ్చి నిర్మాణం కూల్చివేత ప్రారంభించారు.


గీతం’పై పదేపదే దాడులు

ప్రతిష్ఠాత్మక గీతం విశ్వవిద్యాలయంపై వైసీపీ పెద్దలు పగబట్టినట్లు వ్యవహరించారు. ఈ సంస్థ టీడీపీ నేతలది కావడం, చంద్రబాబు కుటుంబంతో బంధుత్వం ఉండడమే దీనికి కారణం. విస్తరణలో భాగంగా తన ప్రాంగణాన్ని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములు కావాలని టీడీపీ హయాంలోనే గీతం దరఖాస్తు చేసుకుంది. వాటికి ధర చెల్లిస్తామనీ పేర్కొంది. ఆ మేరకు వాటిని తన ఆధీనంలో ఉంచుకుంది. దీనిని సాకుగా చేసుకుని.. ఈ ఐదేళ్లలో మూడుసార్లు వర్సిటీలోకి అర్ధరాత్రి వేళ పోలీసుల సాయంతో ప్రవేశించారు. ప్రహరీలు కూలగొట్టి నానా రభస చేశారు.

సబ్బం హరి ఇంటిపైనా దాడి

మాజీ ఎంపీ, విశాఖ మాజీ మేయర్‌ సబ్బం హరి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున భీమిలి నుంచి పోటీ చేశారు. నిత్యం టీవీ చర్చల్లో వైసీపీని, జగన్‌ను విమర్శించారని ఆయనపై కసి పెంచుకున్నారు. సీతమ్మధారలో ఆయన ఇంటి పక్కనున్న 4 అడుగుల పార్కు స్థలాన్ని కలిపి ప్రహరీ నిర్మించారనే ఆరోపణలతో 2020 అక్టోబరు 3 తెల్లవారు జామున పోలీసులు, జేసీబీలతో వెళ్లి ప్రహరీని కూల్చి, నానా రచ్చ చేశారు.

Updated Date - Apr 27 , 2024 | 04:18 AM