AP Assembly Eelction: వచ్చేది మనమే !
ABN , Publish Date - Apr 01 , 2024 | 04:17 AM
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రాబోయేది జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.
3 పార్టీల కూటమి విజయం ఖాయం: పవన్
బాబును జైలులో పెట్టినప్పుడు బాధేసింది
ఆయన్ను కలిసి వచ్చాక పొత్తును ప్రకటించా
నేను చెప్పినట్లే బీజేపీ కూడా కలిసొచ్చింది
ఆ పార్టీ కోసం ఎంపీ సీట్లు తగ్గించుకున్నా
నేను తపనపడినట్లే నేతలూ పోరాడాలి
వైసీపీ మాఫియా, దోపిడీని అరికడితే
అన్ని పథకాలకూ నిధులు వస్తాయి
పింఛన్లు అందరికీ అందేలా చూడండి
3 పార్టీల నేతలకు జనసేనాని పిలుపు
పిఠాపురం, మార్చి 31: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రాబోయేది జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. భారీ మెజారిటీతో సీట్లు గెలవబోతున్నామని తెలిపారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకం ఆగిపోదని.. ఈ విషయాన్ని స్పష్టంగా అందరికీ తెలియజేయాలని మూడు పార్టీల నేతలకు పిలుపిచ్చారు. ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురం గోకులం గ్రాండ్లో ఆదివారం పిఠాపురం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి సైబరాబాద్ వంటి ప్రత్యేక నగరాన్ని తయారు చేసిన అనువజ్ఞుడు, టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం అకారణంగా, కక్షపూరితంగా జైలులో పెట్టినప్పుడు బాధేసిందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. రాజమహేంద్రవరం వెళ్తున్నప్పుడు దారిపొడవునా టీడీపీ కార్యకర్తలు తమ నాయకుడి కోసం పడిన తపన తనను కదిలించిందని, అందుకే సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిశాక తన వంతుగా ఏదైనా చేయాలని భావించి కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి వెళ్తాయని ప్రకటించానని ఆయన తెలిపారు. అప్పుడు తాను చెప్పినట్లుగానే బీజేపీ తమతో కలిసి వచ్చిందని చెప్పారు. ఆ పార్టీ కోసం ఎంపీ సీట్లు తగ్గించుకున్నానని తెలిపారు. తాను పొత్తు కోసం ఎంత తపించానో.. మూడు పార్టీల నాయకులు గెలుపు కోసం అంతే కష్టపడాలని సూచించారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి పనిచేయాలని కోరారు. ‘మూడు పార్టీల మధ్య సమన్వయంతో పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలంటే ఎన్నో అలకలు, మరెన్నో సంఘర్షణలు ఉంటాయి. ఇవేమీ లేకుండా వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే ఏకైక లక్ష్యంతో ఎలాంటి అరమరికలు లేకుండా పొత్తు కుదిరింది. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలో నేను లెక్కలు వేయలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ బాగుండాలి, వైసీపీ కీచక పాలనను తరిమికొట్టాలనే ముందుకెళ్లాను. టీడీపీ, జనసేనల్లో పొత్తుకు సానుకూలంగా 70-80శాతం మంది ఉన్నారు. దీనివల్లే ముందడుగు పడింది. అయితే పొత్తుల వల్ల జనసేన నాయకులు నలిగిపోయారు. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయలేకపోయామని బాధపడ్డారు.
మనకు యువబలం, పోరాడేతత్వం మెండుగా ఉన్నా.. టీడీపీ, బీజేపీ వంటి బలమైన పునాదులు, సమూహాన్ని క్రమశిక్షణతో నడిపించే మెకానిజం ఇంకా సంపాదించలేదు. ఎన్నికల సమయంలో దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న పార్టీల ఎత్తుగడలు, ఎలక్షనీరింగ్, సమన్వయం చాలా కీలకం’ అని వివరించారు. ‘ఇప్పుడు ఇస్తున్న పథకాల కంటే అధికంగానే సంక్షేమ ఫలాలు పంచుతాం. మద్యం, గంజాయి, ఇసుక, ల్యాండ్ మాఫియా వంటి వాటిని అరికడితే అన్ని పథకాలకు కచ్చితంగా డబ్బులు సర్దుబాటవుతాయి. వైసీపీ దోపిడీ అరికడితే అప్పులు చేయకుండానే సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు. ఎన్నికల కోడ్ వల్ల ప్రతినెలా ఒకటో తేదీన అందాల్సిన సామాజిక పింఛన్లు ఈ నెల ఆలస్యం కావచ్చు. వలంటీర్లు లేకుండా పింఛన్లు సక్రమంగా పంపిణీ చేసేందుకు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నియామవళికి అనుగుణంగా అధికారులకు సహకరించాలి’ అని సూచించారు. సమావేశంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ, గిరీశ్ వర్మ, బీజేపీ ఇన్చార్జి బుర్రా కృష్ణంరాజు, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆలయాల్లో పూజలు..
పిఠాపురం పాదగయ క్షేత్రంలో కొలువై ఉన్న పురుహూతికా అమ్మవారిని పవన్ ఆదివారం దర్శించుకుని పట్టుచీర సమర్పించారు. అష్టోత్తర కుంకుమార్చనలో పాల్గొన్నారు. కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఔదంబర వృక్షానికి కొబ్బరికాయ ముడుపు కట్టారు. స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు.
జ్వరంతో హైదరాబాద్ పయనం.. నేడు తిరిగిరాక
జ్వరం, గొంతునొప్పితో రెండ్రోజులుగా బాధపడుతున్న పవన్.. ఆదివారం తన పర్యటన ముగించుకుని సాయంత్రం హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లారు. అక్కడ చికిత్స చేయించుకుని సోమవారం తిరిగి వస్తారని జనసేన వర్గాలు తెలిపాయి.