Share News

CM Chandrababu : నాలెడ్జ్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌

ABN , Publish Date - Dec 07 , 2024 | 03:59 AM

ఏపీని నాలెడ్జ్‌ హబ్‌గా మారుస్తున్నామని, విశాఖపట్నం దానికి కేంద్రంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలు చేసే ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించడంతోపాటు వారికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు.

CM Chandrababu : నాలెడ్జ్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌

  • దాని కేంద్రం విశాఖే: చంద్రబాబు

  • రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు

  • స్టార్టప్స్‌కు అనుగుణంగా పాలసీలు

  • వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం

  • స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో ముందుకు

  • డీప్‌ టెక్నాలజీ సదస్సులో సీఎం వెల్లడి

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. 15 శాతం వృద్ధి రేటు సాధించాలని ధ్యేయంగా పెట్టుకున్నాం. దీనికి పది ప్రణాళికా సూత్రాలు తయారు చేసుకున్నాం.ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరి కంటే ఎక్కువ తెలుగువారే ఉన్నారు. ఐటీ నిపుణుల్లో 30 శాతం ఆంధ్రకు చెందిన వారే. జనాభా నిర్వహణ గురించి చర్చించుకోవలసిన సమయం వచ్చింది. అధిక మానవ వనరులు ఉంటే.. దేశం సేవల కేంద్రంగా వర్ధిల్లుతుంది.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాఖపట్నం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఏపీని నాలెడ్జ్‌ హబ్‌గా మారుస్తున్నామని, విశాఖపట్నం దానికి కేంద్రంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలు చేసే ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను ప్రోత్సహించడంతోపాటు వారికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. శుక్రవారం ‘డీప్‌ టెక్నాలజీ’పై విశాఖలో నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కొత్త ఆలోచనల(ఇన్నోవేషన్‌)ను అభివృద్ధికి ఉపయోగించుకోవాలన్నారు. విభిన్న సమస్యలకు పరిష్కారాలను చూపించే స్టార్ట్‌ప్సకు దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ తరహా ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రాష్ట్రాన్ని ఐదు జోన్లు గా విభజించి ఇన్నోవేషన్‌ హబ్‌లు ఏర్పా టు చేస్తున్నామన్నారు. వాటిని అమరావతిలోని సెంట్రల్‌ హబ్‌ గైడ్‌ పర్యవేక్షిస్తుందన్నారు. దీనికి టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ గా పేరు పెట్టినట్లు వెల్లడించారు. ప్రతి ఇంటి నుంచీ ఒక పారిశ్రామికవేత్త రావాలన్న తమ నినాదాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఇందుకు అత్యుత్తమ వ్యవస్థను ఏర్పాటుచేసే ఉద్దేశంతోనే ఇన్నోవేషన్‌ హబ్‌ ఎకో సిస్టమ్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు.


ఆయా హబ్‌లు స్థానికంగా ఉండే పరిశ్రమలు, విద్యాసంస్థల తో కలిసి నడిచేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్రం నుంచే కాకుండా దేశ, విదేశాలకు చెందిన ఇన్నోవేటర్స్‌ ను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఖర్చు తక్కువగా ఉండి, ఎక్కువ మంది వినియోగించేలా ఆవిష్కరణలు ఉండాలన్నా రు. నాలెడ్జ్‌ ఎకానమీలో రాష్ట్రాన్ని నంబర్‌వన్‌ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ప్రసంగంలో సీఎం ఇంకా ఏమన్నారంటే..


పీ-4తో ముందుకు..: హైదరాబాద్‌లో 1996లో పీపీపీ విధానంలో హైటెక్‌ సిటీని అభివృద్ధి చేశాం. ఇప్పుడు ప్రజల భాగస్వామ్యం కూడా కలిపి ‘పీ-4’ విధానంతో మరింత ముందుకు వెళ్లేందు కు ప్రయత్నిస్తున్నాం. ప్రతి 3 నెలలకొకసారి డీప్‌ టెక్నాలజీ ప్రదర్శనలు నిర్వహిస్తాం. మెషీన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), రోబోటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌.. అన్నీ డీప్‌ టెక్నాలజీ కిందికే వస్తాయి. డ్రోన్ల సాయం తో పురుగుల మందును పిచికారీ చేస్తు న్నాం. అవసరమైన మందులను కూడా డ్రోన్ల ద్వారా వేగంగా పంపగలుగుతున్నాం. క్లీన్‌, గ్రీన్‌ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తున్నాం. విశాఖలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

  • ప్రతి కుటుంబానికీ లబ్ధి..

ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచా రం రాష్ట్రప్రభుత్వం వద్ద ఉంది. ఏ సమస్య వచ్చినా సాంకేతిక సాయంతో తక్షణ నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. అన్ని సేవలను పొందేలా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రతి కుటుంబానికీ లబ్ధి కలిగేలా కార్యక్రమాలను అమలు చేస్తాం. పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మూలించడమే లక్ష్యంగా పథకాల ను రూపొందిస్తాం. అక్షరాస్యతను పెంచడంపై దృష్టి సారిం చాం. స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. భవిష్యత్‌లో ఆటిజం వంటి సమస్యలతో బాధపడే చిన్నారులకు ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది.


  • సదస్సులో ఏడు ఒప్పందాలు..

డీప్‌ టెక్నాలజీ సదస్సులో పలువురు ప్రతినిధులు, ఇన్నోవేటర్స్‌, వైద్యులు మాట్లాడారు. తమ అభిప్రాయాల ను, ఆలోచనలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌(జీఎ్‌ఫఎ్‌సటీ)తో వివిధ సంస్థ లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. విద్య, వైద్య రంగాల్లో టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, మహిళా సాధికారిత, తదితర అంశాలపై సమగ్ర, జీఎ్‌సఆర్‌, ఫ్లూయింట్‌ గ్రిడ్‌ లిమిటెడ్‌, జర్మన్‌ వర్సిటీలు ఒప్పందాలు చేసుకోగా.. మరో గేమింగ్‌ కంపెనీ 2 ఎంవోయూలు చేసుకుంది. సీఎంఎస్‌ కంపెనీతో ప్రభుత్వం ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. సదస్సుకు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, జీఎఫ్ఎస్‌టీ వైస్‌చైర్మన్‌ ఎస్‌పీ టక్కర్‌ అధ్యక్షత వహించగా.. మంత్రు లు అనిత, సత్యకుమార్‌, కొండపల్లి శ్రీనివాస్‌, సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, విశాఖ ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేశ్‌బాబు, గణబాబు, ఉన్నతాధికారులు ఎంటీ కృష్ణబాబు, యువరాజ్‌, జీఎఫ్ఎస్‌టీ డైరెక్టర్‌ చదలవాడ కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. అధునాతన టెక్నాలజీలపై మక్కువ చూపే చంద్రబాబు జీఎ్‌ఫఎ్‌సటీ సంస్థను 2020లో ఏర్పాటు చేశారు. ఆయనే దానికి చైర్మన్‌గా ఉన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 03:59 AM