AP Tourism : పర్యాటకంలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతాం
ABN , Publish Date - Dec 24 , 2024 | 05:18 AM
రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు.
ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని.. కొత్త పాలసీకి బోర్డు ఆమోదం
అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి, ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. పర్యాటకాభివృద్ధి కోసం కొత్త బోర్డు కృషి చేస్తుందని పేర్కొన్నారు. సోమవారం విజయవాడలోని ఏపీటీడీసీ కార్యాలయంలో బోర్డు సమావేశం జరిగింది. కొత్త టూరిజం పాలసీతో పాటు పలు కీలక తీర్మానాలను బోర్డు ఆమోదించింది. ఏపీలో పర్యాటకాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కొత్త టూరిజం పాలసీ 2024-29 అభివృద్ధిదాయకంగా, వినూత్నంగా ఉందన్నారు. దీని ద్వారా పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుందని అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తామని తీర్మానించారు. ముఖ్యంగా బీచ్ కారిడార్ అభివృద్ధి, టెంపుల్ సర్క్యూట్స్, అడ్వెంచర్ టూరిజం, జీడీపీ పెంపు, ఉపాధి కల్పన, పర్యాటకులకు రూమ్స్ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని బోర్డు సభ్యులు తీర్మానం చేశారు. బోర్డు సమావేశంలో ఎండీ అమ్రపాలి, ఇతర అధికారులు పాల్గొన్నారు.