Rain Water: వర్షపు నీటిలోనే హమాలీ కాలనీ
ABN , Publish Date - May 27 , 2024 | 11:58 PM
పట్టణంలోని హామాలీ కాల నీ ప్రజలు ముంపునీటిలోనే గడుపుతున్నారు. మూడు రోజల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆర్టీసీ డిపో వెనకనున్న హమాలీ కాలనీ, రాములమ్మ గుడి ప్రాంతాల్లోని నివాస గృహల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. జాతీయ రహదారి పక్కన ఉన్న రెస్టారెంట్లు, సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రాలు కూడా జలమయమయ్యాయి.
![Rain Water: వర్షపు నీటిలోనే హమాలీ కాలనీ](https://media.andhrajyothy.com/media/2024/20240511/27ukd03_51a1707bc2.jpg)
ఇబ్బంది పడుతున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు
ఉరవకొండ, మే 27: పట్టణంలోని హామాలీ కాల నీ ప్రజలు ముంపునీటిలోనే గడుపుతున్నారు. మూడు రోజల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆర్టీసీ డిపో వెనకనున్న హమాలీ కాలనీ, రాములమ్మ గుడి ప్రాంతాల్లోని నివాస గృహల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. జాతీయ రహదారి పక్కన ఉన్న రెస్టారెంట్లు, సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రాలు కూడా జలమయమయ్యాయి. ఎగువ నుంచి వచ్చిన వర్షపు నీరు ముందుకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో కాలనీ మొత్తం వరదనీటితో ముంచెత్తింది.
ముంపునీటిని తొలగించాలని ఆందోళన
వరద నీటితో ముంపునకు గురైన హమాలీ కాలనీలో నీటిని తొలగించాలని ఆ కాలనీ వాసులు, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ముంపునకు గురైన ప్రాంతంలో నీటిని తొలగించాలని తహసీల్దారు శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లగా తమకు సంబంధం లేదని ఆయన చెప్పడంతో అధికారుల తీరుపై మండిపడ్డారు. మూడు రోజుల నుంచి ముంపు నీటిలోనే ఉంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి విషపురుగులు వస్తున్నాయని వాపోయారు. వంక నీరు వెళ్లకుండా అడ్డుగా వేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. వర్షపు నీరు వంకలో పారేందుకు మార్గం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు. అనంతరం తహసీల్దారుకు వినతి పత్రాన్ని అందజేశారు.