TS News: తెలంగాణ భవన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2023-06-02T18:41:32+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్థి వేడుకలు నిర్వహిస్తున్న తరుణంలో తెలంగాణ భవన్‌లో సెహ్జెల్ అనే యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

TS News: తెలంగాణ భవన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్థి వేడుకలు నిర్వహిస్తున్న తరుణంలో తెలంగాణ భవన్‌లో సెహ్జెల్ అనే యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (MLA Durgam Chinnaiah) తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ (Telangana Bhavan) పార్కింగ్ దగ్గర బాధితురాలు విషం తాగింది. ఆమెను వెంటనే తెలంగాణ భవన్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సెహ్జెల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చిన్నయ్య తనను ఆర్థికంగా, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని 2 రోజుల క్రితం ఎన్‌హెచ్ఆర్‌సీ (NHRC), జాతీయ మహిళా కమిషన్‌ను బాధితురాలు కలిసింది. ఎమ్మెల్యే అనుచరులు తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే, అతని అనుచరుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెహ్జెల్ లేఖలో వెల్లడించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. తన చావు తర్వాత అయినా తన కుటుంబానికి న్యాయం జరుగుతుందని లేఖలో సెహ్జెల్ ఆశాభావం వ్యక్తం చేసింది.

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు సందర్భంగా సెహ్జెల్ తెలంగాణ భవన్‌కు వచ్చింది. గతంలో బాధితురాలు హైదరాబాద్‌లోనూ ఆత్మహత్యాయత్నం చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యపై చట్టరిత్యా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ నాలుగు రోజుల క్రితం సెహ్జెల్ ఢిల్లీకి వచ్చింది. మొదటి రోజు కొత్త పార్లమెంట్ భవనం ముందు నిరసన చేపట్టింది. ఆ తర్వాత జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు జంతర్ మంతర్ వద్ద.. నిన్న (గురువారం) ఇండియాగేట్ వద్ద నిరసన తెలిపింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తూ.. ఈ రోజు ఆత్మహత్యాయత్నం చేసింది.

Updated Date - 2023-06-02T18:41:32+05:30 IST